13)యాగశాల నిర్మాణం, విజయనగరం నుండి పిలుపు, ప్రతిష్ఠ ఏర్పాట్లు

యాగశాల నిర్మాణం

గురువుగారు సూచించిన విధంగా యాగశాల ఏర్పాటు అయ్యేలాగ పనులు మొదలు పెట్టాం. ఒక Tractor ఆవిరి గడ్డిని అంతకు ముందే సిద్ధం చేశాం. రాటలు కర్రలు అన్నీ తరలించాం. నాలుగు మూలలకు కావాల్సిన 12 కర్రలు పొడుగు చాలలేదు. ఎంత పొడుగువి కావాలో కొలుచుకుని రాత్రి 8 గంటల తరువాత కానీ రాజమండ్రి వెళ్ళలేకపోయాం. ఆ సైజు కర్రలు ఒక చోట దొరికాయి కానీ అప్పుడు ఇవ్వము, రేపు ఇస్తామన్నారు. అప్పటికి రాత్రి 9:30 అయ్యింది. మాకు ఖాళీ లేకపోవటం వలననే ఇంత Late గా రావలసి వచ్చిందని, రేపు రాలేమని, ఆ కర్రలు మేమే తీసుకుంటామని, జట్టు పనివారితో అవసరం లేదనీ చెప్పాము. వాళ్ళు కూడా ఎదో గుడి పని అంటున్నారు సాయం చేద్దామని ఆ కర్రలను బయటకు లాగారు.

రాత్రి 10 గంటలకు వాటిని తీసుకువచ్చే ఆటో దొరికేలాలేదు. అదే సమయంలో ఒక ఆటో అక్కడ ఎదో సరుకు దిగుమతి చేస్తోంది. ఆ డ్రయివరు మా మధ్య జరుగుతున్నసంభాషణ అంతా వింటున్నాడు. అతనే మా ముందుకు వచ్చి అతనిది దోసకాయలపల్లి అని చెప్పాడు. ఆ కర్రలను మిర్తిపాడు రోడ్డుకి వేసుకువచ్చి గుడి దగ్గర దింపేసి వెళ్ళిపోతానన్నాడు. అతను అడిగిన కిరాయి ఇచ్చేసి కర్రలను అతనికి అప్పజెప్పేసి మేము ఇంటికి వచ్చేసి పడుకున్నాము. అతని సరుకు దిగుమతి పూర్తయిన తరువాత ఆ కర్రలను ఎక్కించుకుని ఆ రాత్రి గుడి దగ్గర పడేసి వెళ్ళిపోయాడు. మరునాటి పనికి ఆటంకం లేకుండా జరిగిపోయింది.

ఫిబ్రవరి నెలలో పని కదా, పెద్ద వర్షాల ముప్పు ఏమీ ఉండదు. ఎలాగోలాగ నీడ వెసెయ్యండి. ఆవిరి గడ్డి తక్కువ వచ్చిందంటే ఇప్పుడు తేలేము. ఆ ఉన్న గడ్డిని జాగ్రత్తగా సరిపెట్టండని చెప్పాను. ఆ పని అయిపొయ్యాక తాపీ మేస్త్రీలకు యజ్ఞకుండాలు మార్కింగు చేసి, మధ్యలో విగ్రహాలు ఉంచడానికి, కలశాలకు వేదిక ఎలా కట్టాలో, అధివాసాలకు కుండీ ఎలా కట్టాలో పురమాయించి మా పని మేము చూసుకుంటున్నాము. అన్నీ ఎలా కడుతున్నారో దగ్గర ఉంది చూసే వెసులుబాటు లేదు.

విజయనగరం నుండి పిలుపు

ఈ లోపల 10,000 ఆహ్వాన పత్రాలు print చేయించాము. అప్పటి వరకు అందిన విరాళాల వివరాలు తెలుపుతూ 50 అడుగుల పొడవు 4 అడుగుల ఎత్తు ఉన్న Flexi చేయించాము. దాన్ని ఉత్తరం వైపు compound wall లోపల కొట్టించాము. Computer Operator పొరపాటు వల్ల ఒక 10 పేర్లు Miss అయినాయి. అందులో అనపర్తి సుబ్బారావుగారు ఇచ్చిన రూ 5,000/- పడలేదు. ఉన్నవాళ్ళు జరిగిన పొరపాటుని అర్థం చేసుకున్నారు. ఈయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆయన పేరు వెయ్యలేదని అనుకున్నారు. ఆ అభిప్రాయం ఎంత కాలానికి మారలేదు.

09-Feb-2008 తారీకు నాడు విజయనగరం రమ్మన్నారు. మాధవరావుగారికి Phone చేశాను తెల్లవారగట్ల 4 గంటలకు బయలు దేరదామని. ఆయన వచ్చారు. కారులో రాజమండ్రి వరకూ వెళ్ళి విశాఖపట్నం వెళ్ళే బస్సు ఎక్కాము. బస్సు అన్నవరం చేరే సరికి వర్షం మొదలయింది. చాలా జోరుగా కురవటం మొదలు పెట్టింది. అప్పట్లో రోడ్లు బాగాలేకపోవటం వలన ప్రయాణం ఎక్కువ సమయం పట్టేది. విశాఖపట్నం చేరినా తగ్గలేదు. అక్కడ దిగి విజయనగరం బస్సు ఎక్కాము. అక్కడ దిగేటప్పటికి పరిస్థితిలో మార్పులేదు. ఆ వర్షంలోనే ఏదో హోటల్ లో కాస్త భోజనం చేసి ఆటోలో పూల్ బాగ్ లోని గురువుగారి ఆశ్రమానికి చేరాము.

ఆ సమయానికి గురువుగారు హైదరాబాదులో ఉన్నారు. మేము వెళ్ళిన 3 గంటలు తరువాత విశాఖపట్నం వరకు విమానంలో వచ్చి Car లో ఆశ్రమానికి చేరుకున్నారు. మాకు కావలసిన సామాగ్రి లిస్టులు తయారుచేసి ఇచ్చేటప్పటికి పొద్దుకూకి పోయింది. అందులో దీక్షా వస్త్రాలు అని ఒక 30 దాకా రాశారు. అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు. అందువలన వాటిని వారి ద్వారానే కొనిపించి ఇస్తే మేము తీసుకువెళ్ళి ఉన్నవి రాజమండ్రిలో కొంటామన్నాము.

వాన చూస్తే ఆగలేదు. అప్పటికి పన్నెండు గంటలనుండి ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉంది. మాకు మతి స్థిమితంగా లేదు. ఈ నెలలో ఇంత వాన పడితే మాఊరు అంతా వరద ముంచెత్తి రైతులంతా దిబ్బ అయిపోతారు. ఇంకా ప్రతిష్ఠ ఏమీ లేదు. ఎవరికీ ఎటువంటి ఉత్సాహం ఉండదు. ఎవరూ రారు అని నిరుత్సాహ పడ్డాము. ఇన్ని గంటలు వాన కురుస్తూ ఉంటే అక్కడ ఎలాగ ఉందని అడగను కూడా అడగలేదు. అక్కడ పరిస్థితి కూడా ఇలాగే ఉండదు అని అనుకుంటానికి చిన్న సందేహం కూడా రాలేదు.

ఒక శిష్యుడిని తీసుకుని ఆ వానలోనే బట్టల కొట్టుకు వెళ్ళి కూర్చున్నాము. అతను కావలసిన దీక్షా వస్త్రాలు కట్టించి ఒక పెద్ద బండిల్ తయారు చేసి మాకు అప్పచెప్పారు. తడవకుండా ప్యాకింగు చేశారు. ఆ మూటను ఆటో లో వేసుకుని విజయనగరం బస్టాండుకు వచ్చాము. రాత్రి 10 గంటలు అయ్యింది. వాన ఆగలేదు. మాలో ఏ ఉత్సాహం లేదు. ఆకలి లేదు. నీరసం వచ్చింది. ఆయనే వెళ్ళి రెండు టిఫిన్ పార్సిళ్ళు కట్టించుకు వచ్చారు. బస్సు వచ్చాక మూటను అందులో వేసుకుని విశాఖపట్నం బయలుదేరాము. బస్సులో ఒక 20 మంది కూడా లేరు.

మళ్ళీ వానలోనే విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్ళే బస్సు ఎక్కాము. చిమ్మ చీకటి, వాన లో బస్సు నడుస్తోంది. ఒళ్ళు నొప్పులు, కళ్ళు మంటలతో ఉన్నాము. నాకయితే బస్సు ఏ ఊరి దాకా వచ్చిందో తెలియటం లేదు. ఆయన మల్లేపల్లి దాకా వచ్చాక ఇంటికి ఫోను చేసి కారుని రాజానగరం రమ్మందామన్నారు. అదేదో ఆయన్నే చేయమన్నాను. మా అబ్బాయి పలికాడు. వెంటనే అతను, శ్రీదేవి(మా కోడలు) కారులో రాజానగరం వచ్చారు. మేము దిగేటప్పటికి వాళ్ళు ముందే చేరిపోయారు. ఎంతో దిగులుగా రాజానగరంలో దిగేటప్పటికి నెల పొడిగా ఉంది. ఒక్కసారిగా మా బాధ అంతా పోయింది. తెల్లవారకుండా ఇంటికి చేరిపోయాము. 20 గంటల సేపు ఆగకుండా వాన కురవడం చూశాము.

ప్రతిష్ఠ ఏర్పాట్లు

అంతకు ముందే యాగానికి కావలసిన ఇంధనం(పుల్ల) 2 టన్నులు మరియు 5 రకాల సమిధలు రకానికి 50kg లు తగ్గకుండా సమకూర్చుకోవడం అయ్యింది. 5 రోజులకు సన్నాయి మేళం, Photo and Videographer లను ఏర్పాటు చేశారు. కొత్త ఊరు సెంటరు వినాయకుడి గుడి దగ్గర నుండి శివాలయం వరకు Lighting వేశారు.

ఆటోలో మైకు పెట్టుకుని కొందరు చుట్టు పక్కల ఊర్లన్నీ తిరిగి ఆహ్వాన పత్రాలు ప్రతీ ఇంటికి పంచి పెట్టారు. కొందరు మూల మూర్తులను ట్రక్కులో పెట్టుకుని పూల మాలలతో అలంకారం చేసి చుట్టు పక్కల ఊళ్ళన్నీ తిప్పి ఊరేగించారు. రోజూ ఎంతో కొంత వర్షం పడటం వలన రోడ్లన్నీ చిత్తడిగా ఉన్నాయి. ఊరేగింపు వీడియోలో రోడ్ల మీద గోతులలో ఉన్న నీళ్ళు కనపడతాయి.

img162img163

మేము ఆదివారం 10-Feb-2008 తెల్లవారగట్ల విజయనగరం నుండి List లతో దీక్షావస్త్రాల మూటతో ఇంటికి చేరామని అంతకుముందే రాశాను. ఆదివారం మార్కెట్ కి శెలవు, మంగళవారం నుండి కార్యక్రమాలు మొదలు. అందువలన సోమవారం ఉదయం బయలుదేరి రాజమండ్రి మార్కెట్ లో లిస్టు ప్రకారం కావలసిన ప్రతిష్ఠ ద్రవ్యాలను కొనడానికి వెళ్ళాము. ఆ లిస్టు అంతా ఒక షాపువాడు కట్టడానికి సమయం చాలదని దానిని రెండు భాగాలు చేసి రెండు షాపులలో ఇచ్చాము. రెండువేల కొబ్బరికాయలు రాశారు. ఇంకా కలశలు, 5 ఇత్తడి బిందెలు కొనుక్కుని సాయంత్రానికి ఇంటికి చేరాము. రోజూ కావలసిన అరటి గెలలు, పువ్వులు, పూల దండలు, తమలపాకులు వగయిరా ఏరోజుకి ఆరోజు సాయంత్రం చేరేలాగ ఏర్పాటు చేశాము. ఆవునెయ్యి 36 kg లు (రెండు డబ్బాలు) తీసుకున్నాము.

16-Feb-2008 ఉదయం ప్రతిష్ఠ అయ్యాక 11 గంటల నుండి మహా అన్న సమారాధన జరుగుతుందని కారపత్రాలలో ప్రముఖంగా వేయించాము. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఎంతమంది రావొచ్చు? ఎంతమందికి వంట ఏర్పాట్లు చెయ్యాలి? రోజూ ఏదో సమయంలో పడుతున్న వాన వల్ల ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? వాన పడకుండా చెయ్యటం పూర్తిగా దేవుడి అనుగ్రహం మీదే ఆధారపడి ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఒక వేళ పడ్డా కార్యక్రమం సక్రమంగా జరిగేలా చేయగల ఏర్పాట్లు కాని శక్తి కాని ఎవ్వరి వద్ద లేవు.

కొంత మంది ఒక 5 వేల మంది రావచ్చన్నారు. మరికొంత సేపటికి చుట్టుపక్కల ఊళ్ళు గురించి ఆలోచించి అంచనాను 10 వేల వరకూ పెంచారు. నాకు ఎందుకో 15 వేల మంది వరకూ భోజనం ఏర్పాట్లు అవసరం అవుతాయని అనిపించింది. చుట్టుపక్కల చెరుకు తోటలలో చెరుకు నరకడానికి అనేక పొరుగూరు బంటాలు పని చేస్తున్నాయి. ఊళ్ళో ప్రతీ ఇంటిలోను వారి తాలూకు దగ్గర బంధువులు అందరూ వస్తారు. అలాగ ఎవరింట్లో వాళ్ళకు కనీసం ఇంటికి 10 మందన్నా వచ్చే అవకాశం ఉంది. మేము పంచిపెట్టిన ఆహ్వాన పత్రాలే కనీసం ఒక ఎనిమిది వేల ఇళ్ళకు చేరాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆఖరు అంచనాగా పదిహేనువేల మందికి సరిపడగా వంట సరుకులు, పని వారిని ఏర్పాటు చేశారు. ఒక వంద దాకా అరటి పళ్ళ గెలలను కూడా తీసుకువచ్చారు. రోడ్డుకి ఉత్తరంగా ఉన్న సుమారు రెండు యకరాల వరి కోసేసిన మళ్ళను తొక్కించి వంటలకు, షామియానాలకు ఏర్పాటు చేశారు.

మూడు నెలల ముందుకు

2007 డిశెంబరు నెలలో ప్రతి రోజు రాత్రి 8 గంటలకు కరంటు తీసివేసి 9 గంటలకు ఇచ్చేవాడు. శీతాకాలం రాత్రి అవటం వలన వాతావరణం చల్లగా ఉండేది. చిమ్మ చీకటి, కరంటు లేక పోవటం వలన పూర్తి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండేది. ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది గంటలకు రెండు నిమిషాలు ముందుగా గుడికి ఒక్కడినే చేరుకునే వాడిని. కరంటు పోగానే ఒక కొవ్వొత్తిని వెలిగించి గర్భగుడి గడప మీద మధ్యలో పెట్టి గర్భగుడిలో కూర్చొనేవాడిని. ఆ కొవ్వొత్తి కాంతి లోపలికి, బయట మెట్ల వరకూ విస్తరించేది. గది చుట్టూ తెల్లని Tiles, క్రింద నీడ ఆనేలాగా ఉన్న గ్రానైటు ఫ్లోరింగు ఆ వాతావరణం ఆ ప్రశాంతత మరో లోకంలో ఉన్నట్లు ఉండేది. స్వామీ నీవు మరికొన్ని రోజులలో ఇక్కడ కొలువు తీరబోతున్నావన్న భావనతో అదేదో మైకంలాగ చెప్పలేని ఆనందం కలిగేది. మళ్ళీ 9 గంటలకు కరంటు రాగానే ఆ వింత అనుభూతి పోయేది. వెంటనే కొవ్వొత్తి ఆర్పేసి ఇంటికి వచ్చేసేవాడిని. ఒకనాడు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా రాసుల కొద్దీ మల్లెపూల మీదుగా గాలి వీస్తే ఎలాంటి సువాసన వస్తుందో అలాంటి వాసన నాలుగు మూలల గుబాళించడం మొదలు పెట్టింది. గాలి ఎటు వీస్తే అటు చుట్టబెట్టడం మొదలు పెట్టింది. మల్లెతోట మధ్యలో ఉన్నట్లు ఉంది. గుడి చుట్టూ, లోపల అంతా ఒకటే సువాసన. ఆ చుట్టు పక్కల ఒక మల్లెపొద కూడా లేదనేది పచ్చి నిజం. మరి ఈ సువాసన ఎక్కడ నుంచి వస్తోంది? స్వామివారు తన రాకను తెలియజేయడానికి ఎలాంటి వింతను ప్రదర్శిస్తున్నారు. మల్లెల వాసనను ఆస్వాదించడానికి ఎటువంటి గొప్ప జ్ఞానము ఏమీ అక్కరలేదు కదా. అలాగ ఒక పది నిమిషాల పాటు సువాసనలు వెదజల్లి ఒక్కసారిగా మాయం అయిపోయాయి. మళ్ళీ గాలి మామూలు అయిపోయింది. ఇటువంటి అనుభూతి అంతకు ముందు ఎప్పుడూ కలగలేదు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు మళ్ళీ అలాంటి వింతే జరిగింది. దానిని తరువాత వివరిస్తాను.

M.L.A. శ్రీ చిట్టూరి రవీంద్ర గారిని ఆహ్వానించడానికి కొంతమంది కాకినాడ వెళ్ళాము. అక్కడ వారిని కలిసి స్వయంగా ప్రతిష్ఠ జరిగే 5 రోజులలో ఒకసారి రావలసినదిగా ఆహ్వానించాము. కొన్ని గ్రూపు రాజకీయాల కారణంగా ఆయన వస్తారన్న నమ్మకం లేకపోయినా పిలవడం మన బాధ్యత కాబట్టి పిలిచి వచ్చాం. కొంతమంది రెండు మూడు రోజులు మా కారులో దూర ప్రాంతాలదాకా తిరిగి, ఆ ఊళ్ళలో గుడికి చందాలు ఇచ్చిన వారిని కలిసి ఆహ్వాన పత్రాలు అందచేశారు. అన్ని రకాల ఏర్పాట్లు ఇంచు మించుగా పూర్తయినాయి. ధ్వజ స్తంభం నిలబెట్టడానికి 4′ X 4′  5 అడుగుల లోతు ఉండేలా గొయ్యి తవ్వి నెల మట్టం వరకు లోపల ఇటుక గోడ కట్టించాము. అడుగున 18″ మందం కాంక్రీటు కొట్టాము. కాంక్రీటులో మళ్ళీ ఒక అడుగులోతు చిన్న కన్నం వేయవలసి వచ్చింది. 1 అడుగు వెండి ధ్వజ స్తంభాన్ని అందులో పెట్టాలన్నారు.

12)కాశీ ప్రయాణం

రెండు రోజులు పోయాక నలుగురూ కూర్చొని కాశీ ప్రయాణం గురించి ఆలోచించాము. 2007 డిసెంబరు ఆఖరి వారంలో వెళ్ళి వస్తే బాగుంటుందనుకున్నాము. ఒక పది పేర్లు ప్రతిపాదించుకున్నాము. అందులో కనీసం ఆరుగురయినా వస్తారని ఆశ. పండక్కి తిరిగి వచ్చేయవచ్చు. ఆ తరువాత అయితే ఇక్కడ జరుగుతున్న పనులు పూర్తవడానికి సమయం ఉండదు. ఇలాగ అనుకున్నాక మరునాడు ఉదయం పాతూరు రామాలయం దగ్గరకు వెళ్ళాను, ప్రయాణం సంగతి మాట్లాడదామని.

అక్కడ పరిస్థితి చూసి మాట రాలేదు. రాత్రికి రాత్రి కాశీ ప్రయాణం గొడవ ఎలా పాకిపోయిందోకాని జనం పెద్ద గుంపుగా ఉన్నారు. ఇద్దరు మనుషులకు చేతినిండా పనితో ఊపిరి ఆడటం లేదు. ఒకళ్ళు పేర్లు, వయస్సు రాసేవాళ్ళు మరి ఒకళ్ళు 1500 రూపాయలు టిక్కెట్ల కోసం వసూలు చేసేవాళ్ళుతో గందరగోళంగా ఉంది. ఒక రెండు గంటలు గడిచేటప్పటికి సుమారు 86 పేర్లు నమోదయ్యాయి.

ఒక వారం రోజులలో ప్రయాణం. ఇన్ని Tickets దొరుకుతాయో లేదో తెలియదు. వెంటనే రాజమండ్రి రైల్వేస్టేషను కు బయలుదేరిపోయాం. హైదరాబాదు నుండి వారణాసికి వెళ్ళే రైలయితే starting station కాబట్టి దొరుకుతాయని దానికి రిజర్వేషను రాసి ఇచ్చాం. ఆ ఫారాలు ఒక వారం రోజుల తరువాత Return Journey ఉండేలాగ పూర్తిచేసి కౌంటరులో ఇచ్చాం. ఒక మంచి క్లర్కు ఉన్నారు. స్వామి దయ ఉంటే ఇంకేం కావాలి? ఆయన అవి అన్నీ చూసుకుని క్యూలో ఉన్నవారికి ఒక టిక్కెట్టు, తరువాత మా గ్రూపులో ఆరుగురికి ఒక ఫారం ఉండటం వలన అది ఒకటి చొప్పున క్యూలైన్లో ఉన్నవాళ్ళకి ఇబ్బంది లేకుండా, మా పని కూడా అయ్యేలాగ టిక్కెట్లు కొట్టడం ప్రారంభించాడు.

అలాగ ఒకటి రెండు గంటలు అయ్యేటప్పటికి అందరి టిక్కెట్లు వెళ్ళడానికి, రావడానికి తయారయిపోయాయి. వాటికయిన మొత్తం సొమ్మును ఒక కాగితం మీద వేసి మొత్తం టిక్కెట్లను Calculator ని బయటకు లెక్క చూసుకోవడానికి ఇచ్చారు. అవన్నీ తీసుకుని పేర్లను, సొమ్మును సరి చూసుకుని వారికి చెల్లింపు చేశాము. ఒక్కరికి కూడా Ticket రాలేదు అనే బాధ లేకుండా అందరికీ రిజర్వేషను దొరికింది.

 

ప్రయాణం దిగులు

ఇంతవరకు బాగానే ఉంది. అస్సలు ఊహించని ఉత్సాహం ప్రజల్లో కలిగింది. కానీ వీరెవరికీ హిందీ రాదు. మనకీ కాశీలో ఇంతమందికి వసతి ఇతర అవసరాలు ఎలా సమకూర్చాలో తెలియదు. డిసెంబరు నెలలో అక్కడ విపరీతమయిన చలి ఉంటుందని తెలుసు. ఎవరూ తప్పిపోకుండా క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యం. Tickets S1 నుండి S10 వరకు అన్నిబోగీలలోను ఖాళీలను బట్టి వచ్చాయి. ఒక అయిదారుగురు ఒంటరివాళ్ళం ఉన్నాం. మిగతావారంతా కుటుంబాలతో ఉన్నారు. Booking Order లో రకరకాల చోట్ల బెర్తులు వచ్చాయి. అవన్నీ తిరగరాసి, ఒక గ్రూపు వాళ్ళు ఒక చోట ఉండేలాగ List తయారు చేశాము.

మాధవరావుగారు 2 బాక్సులు ఆపిల్సు కొన్నారు. నేను ముందు రోజు హైదరాబాదు వెళ్ళిపోయాను. మిగిలిన వాళ్ళందరూ మరునాడు జన్మభూమి ఎక్సుప్రెస్ లో సికిందరాబాదు చేరుకున్నారు. నేను రైలు బయలుదేరే సమయానికి ఒక గంట ముందు Station కు చేరుకున్నా. అప్పటికి ఆయన Apples పంచుతున్నారు.

ఈ లోపల Train Platform మీదకు వచ్చింది. అందరూ కంగారుగా లేచిపోయారు. ఎవరిని ఏ పెట్టెలోకి పంపాలని చూస్తూ ఉంటే Tickets కనపడటంలేదు. ఆయనకు ఒకటే కంగారుగా ఉంది. ఏం జరిగిందో అర్థం అవటానికి కాస్త Time పట్టింది. ఈ లోపల నా సీటెక్కడంటే నా సీటెక్కడని జనం కంగారు పడుతున్నారు. అసలే Platform అంతా ఎంతో గోలగా ఉంది. అరచినా ఎవరికీ ఏమీ వినపడేలాలేదు.

ఆయన వెనక్కి పరిగెత్తి Apples పంచిన చోట వెతికాడు.  భగవంతుడి దయవల్ల Tickets అన్నీ క్షేమంగా దొరికాయి. List ఎక్కడో పారేశాడు. ఈ లోపల Train Time అయిపోయింది. అందరూ సామానుతో సహా ఎదురుగా ఉన్న బోగీలోకి ఎక్కేశారు. డిసెంబరు నెలలో కూడా చెమటలు పట్టాయి. టిక్కెట్లు దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక బోగీలో ఎన్ని సీట్లు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రకారంగా జనాల్ని S1 నుండి S10 వరకు తీసుకు వెళ్ళి ఈ సీటు(బెర్తు) నీది పడుకో అని చెప్పి తెల్లవారాక మార్పులు చేసుకుందామని అందరినీ సద్దేటప్పటికి రెండు గంటల Time పట్టింది. ఈ లోపల T.C. ల హడావుడి. వాళ్ళకి వివరం చెప్పి తరువాత చూసుకోమన్నాము. ఇంకొన్ని తలనొప్పుల తరువాత మొత్తం మీద అందరూ settle అయ్యారు. తెల్లవారాక వాళ్ళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని Adjust అయ్యారు.

తిరుగు ప్రయాణంలో ఇటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఉండటానికి రైలు ప్రయాణంలో ఉండగానే నేను మాధవరావు గారు ఖాళీలను బట్టి కుటుంబాలను బట్టి ఏ బోగీలో ఎవరు ఎక్కాలో పక్కా List తయారు చేశాము. అందువలన తిరుగు ప్రయాణంలో ఏ ఇబ్బందులు రాలేదు. ఎవరి బోగీ దగ్గర ఆ గ్రూపువాళ్ళందరూ విడిగా కూర్చున్నారు. రైలు రాగానే ఎక్కెయ్యగలిగారు.

అరుణ కుమార్ గారు:   ఒకరోజు ప్రయాణం దగ్గరకొచ్చాక మల్లేపల్లి నుండి అరుణ కుమార్ గారు సడన్ గా Motor Cycle మీద వచ్చి గుడి దగ్గర ఆగారు. ఆయన్ను అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఆయన గొల్లబాబు గారికి ఎక్కువ పరిచయస్తుడని తరువాత తెలిసింది. వచ్చీరాగానే నన్ను చూసి ప్రశ్నల వర్షం కురిపించారు. కాశీ గురించి, అక్కడ శివలింగానికి చేయవలసిన ప్రాధమిక ఉపచారాల గురించి అడిగారు. నాకేమీ తెలియదన్నాను. కాసేపటికి నన్ను అర్థం చేసుకున్నారు. ఆయనకు కాశీ యాత్రల అనుభవం ఉందని తెలిసింది. ఈ జనాన్ని Manage చేసే బాధ్యత, శివలింగానికి ప్రాధమిక ఉపచారాలు చేసి ఇక్కడకు తీసుకువచ్ఛే బాధ్యత తీసుకుంటానన్నారు. మొదట వచ్చీ రాగానే కాస్త దూకుడుగానే ప్రవర్తించారు. తరువాత అంతా ప్రశాంతం. నా నెత్తి మీద నుండి పెద్ద బరువు దిగిపోయిన్నట్లు అయ్యింది. ఇది ఆ స్వామివారు చేసిన మరి ఒక ఉపకారం. ఆయనకు మరియొక ఆరుగురికి తత్కాల్ లో టిక్కెట్లు తీసుకున్నాము.

రైలు సికిందరాబాదు నుండి రెండు రాత్రిళ్ళు ఒక పగలు ప్రయాణం. కొంచెము Late గా ప్రయాణించడం వలన తెల్లవారగట్ల సుమారు 4 గంటలకు అలహాబాదు చేరుకునేలా ఉంది. నా ప్రోగ్రాము ప్రకారం అందరూ కాశీలో దిగి బసలో చేరుకున్నాక 4 రోజులు ఉంటాము కాబట్టి ఎవరికి నచ్చినట్లు వారు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్ళి ఏది కావాలంటే  అది చూసుకోవచ్చనుకున్నాను. కానీ అరుణ కుమార్ గారు అందరూ అలహాబాద్ లో దిగిపోతే ఇక్కడ త్రివేణీ సంగమస్నానం తీర్థ విధులు చేసుకుని కాశీకి వెళ్ళవచ్చు, లేకపోతె ముందుకు 200 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ వెనక్కు రావలసి వస్తుందని చెప్పినట్లున్నారు. కొంతమంది నన్ను సంప్రతించడానికి వచ్చారు.

ఎలాగూ Program బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి నేనేమీ అడ్డుచెప్పలేదు. కాకపొతే అనేక కంపార్టుమెంటుల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆ సమాచారం అందించి అందరూ దిగేలాగ చూడటం ఒక పెద్దపని. ఎవరయినా మిగిలిపోతే వాళ్ళు చాలా తిప్పలు పడాల్సి వస్తుందని భయం. అలా తప్పిపోయిన వాళ్ళను గుర్తించడం పట్టుకోవడం ఇంకా పెద్దపని. సరే ఏం చేశారో ఎలా తిప్పలు పడ్డారో మొత్తం అందరినీ అప్రమత్తం చేసి తెల్లవారకుండా అందరూ అలహాబాద్ లో దిగిపోయారు. అక్కడ నుండి ఒక పండా గారి విశాలమయిన విడిది లాంటి చోటికి చేరాము. మహా చలిగా ఉంది. ఉదయం అవసరాలు తీర్చుకున్నాక అందరినీ గంగా నది ఒడ్డుకు తీసుకు వెళ్ళారు. అక్కడ నుండి త్రివేణీ సంగమం వరకు అనేక పడవలలో వెళ్ళాము. ఎన్నో నీటి పక్షులు ఎగురుతున్నాయి. యాత్రికులు అవి తినడానికి ఏవో గింజలు వేస్తున్నారు.

సంగమం దగ్గర యమున ఒరవడి ఎక్కువగా ఉంది. నీళ్ళు ఐసు అంత చల్లగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు రెండు మునుగులు మునిగి పడవలు ఎక్కేశాము. ఎందుకో నాకు అంతగా వణుకు రాలేదు. జీవితంలో ఎన్నో సంవత్సరాలు తరువాత గంగా నదిని దర్శించే భాగ్యం కలిగినందుకు ఉద్వేగంగా ఏడుపు మాత్రం వచ్చింది.

తరువాత గంగ ఒడ్డున తీర్థ విధులు నిర్వహించుకుని బస దగ్గరకు చేరాము. మేము కొడరము పెందరాళే బయలుదేరి రాత్రి 8:00 గంటలకు బస్సులో వారణాసి చేరిపోయాం. అంతకు ముందే మాట్లాడుకున్న సత్రంలో రూముకి చేరిపోయాం. మిగతావాళ్ళు ఆర్ధరాత్రి దాటాక రైలులో వారణాశి చేరి చాలా ఇబ్బందులు పడ్డారు.

తెల్లవారాక వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో కనిపెట్టి అందరు కలుసుకుని ఆంధ్రా ఆశ్రమానికి చేరిపోయాం. అంతటితో కాశీలో వసతి సమస్య తీరింది. అక్కడ నుండి నాలుగు రోజుల దాకా ఎవరి ఇష్టం వారిది. కాశీలో, ఆ చుట్టుపక్కల, అయోధ్య, గయ ఇలాగ ఎవరి అవకాశం ప్రకారం వాళ్ళు తిరిగారు.

మేము నలుగురం మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు. కాశీ విశ్వేశ్వరుడి దివ్య దర్శనం చేసుకున్నాక మెయిన్ రోడ్ లో ఉన్న శిల్ప నిలయానికి వెళ్ళాం. వాళ్ళకు మేము వచ్చిన పని గురించి చెప్పి నర్మద బాణ లింగం ఎక్కడ దొరుకుతుందోనని అడిగాం. వాళ్ళదే ప్రధానమయిన పని కేంద్రం (work shop) ఒక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇది Show Room. ఆ Address ఇచ్చి రిక్షాలను పిలిపించి అక్కడకు పంపించారు.

అక్కడ అనేక వేల శివలింగాలు ఉన్నాయి. మాకు 9″ size ఉన్న ఒక ఉత్తమమైన శివలింగాన్ని ఇమ్మన్నాము. మంచి చెడ్డల సంగతి తెలియదు. అంతా మీదే బాధ్యత అని చెప్పాము. ఆ మరునాడు ఇస్తామన్నారు. అక్కడే కృష్ణ భగవానుడి విగ్రహం కూడా Select చేసుకున్నాము. దానికి తుది మెరుగులు దిద్ది రెండు రోజులలో తయారు చేసి ఇమ్మన్నాము.

ఆ మరునాడు ప్రస్తుతం ఆలయంలో విరాజిల్లుతున్న శివలింగాన్ని ఇచ్చారు. గొల్లబాబు గారు తీసుకున్నారు. ఆ రాయి లోనే ఒక మచ్చ ఉంది. అది అర్జున బాణం అంటారని తరువాత తెలిసింది. Show Room లో 108 పాలరాతి శివలింగాలు, ఒక 4″ శివలింగం, దక్షిణావృత శంఖం, పూరించే శంఖం, చామరం కొన్నాము.

తిరుగు ప్రయాణం రోజు ఉదయం వరకు మిగతా వారంతా రక రకాల వ్యాపకాలు, విహారాలు పూర్తి చేసుకుని శివలింగం ఎక్కడ, మీరేమి చేశారు అని మమ్మల్ని అడిగారు. అప్పటిదాకా ఆ పని మీద ఎవరైనా ఉన్నారా, ఏమయింది అని పట్టించుకున్నవాళ్ళు లేరు. బహుశ ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఏదో చేసే ఉంటామని నమ్మకం కావచ్చు.

ఆ ఉదయం సుమారు 10 గంటలకు ఒక 20 మంది దాకా మాతో వచ్చారు. శివలింగం 25kg ల 200 గ్రాములు బరువు ఉంది. మాతో వచ్చిన వాళ్ళకి కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని కూడా చూపించాము. దానికి తుది మెరుగుల పని జరుగుతోంది. సాయంత్రానికి పూర్తిచేసి Packing చేసేయమన్నాము. Station కి వెళ్ళేటప్పుడు దారిలో తీసుకుని వెళ్ళిపోతామన్నాము.

శివలింగాన్ని అరుణ కుమార్ గారికి అప్పజెప్పాము. ఆయన దానిని తీసుకుని గొల్లబాబు గారి బృందంతో బయలు దేరి తిన్నగా మణికర్ణికా ఘట్టానికి తీసుకువెళ్ళి గంగా జలంతో అభిషేకించి, కాలభైరవుడి దగ్గర పెట్టి పూజ చేయించి తల మీద పెట్టుకుని విశ్వేశ్వరుడి సన్నిధికి తీసుకు వచ్చారు. బలమైన మనిషి అవటం వలన Q లో కొన్ని ఇబ్బందులు ఎదురయినా స్వామి వారి సన్నిధి దాకా అలాగే శిరసు మీదే ఉంచుకుని, సన్నిధిలో అభిషేక జలాలతో ముంచి తీసి అన్నపూర్ణ తల్లి సన్నిధిలో కొత్త వస్త్రంలో కట్టి స్టేషన్ కు తీసుకు వచ్చారు. మేము 108 శివలింగాలు, శంఖాలు ప్యాకింగు చేయించి దారిలో Work Shop వద్ద సిద్ధంచేయబడిన కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని తీసుకుని Station చేరాము. ఈ సారి ముందుగానే ఎవరి coach లో ఎవరు ఎక్కాలో పక్కాగా తయారు చేసి ఉన్న list ల ప్రకారంగా వాళ్ళు గ్రూపులుగా విడిపోయి Platform పొడుగునా గుంపులుగా కూర్చుండటం వలన ఎటువంటి ఇబ్బంది రాలేదు.

రైలు నాలుగు గంటలు లేటుగా వచ్చింది. అర్ధరాత్రి దాటిపోయినా తరువాత ఎక్కగలిగాము. ఎవరి బోగీలోకి వారు కంగారుగా ఎక్కేశారు (తిరుగు ప్రయాణంలో అందరికీ సామాను పెరిగింది, కాశీలో కొనుగోళ్ళ వలన). ఒక్క కృష్ణుడి విగ్రహం మాత్రమే Platform మీద ఉండి పోయింది. ఎత్తేవాళ్ళు లేక. ఎవరికి వాళ్ళు వాళ్ళ సామాను ఎక్కించుకునే ఆత్రుతలోనే ఉన్నారు. ఈ లోపల బాబులుగారు, సూర్యనారాయణ గారు గబ గబా వచ్చి కృష్ణుడిని కూడా రైలు ఎక్కించారు. బరువుగా ఉండటం వలన Packing దెబ్బ తినకుండా ఉండటం కోసం Door పక్కనే ఉన్న మొదటి బెర్తు క్రిందకు చేర్చాము. పూర్తిగా క్రిందకు వెళ్ళలేదు. సగం లోపలకు సగం బయటకు ఉండిపోయింది. సరిగ్గా ఆ బెర్తు మీద ఒక ముస్లిం కూర్చుని ఉన్నాడు. ఆ Packing ఏమిటో తెలియదు కాబట్టి ఒక కాలు కూడా దాని మీద పెడుతున్నాడు.

తెల్లవారిన తరువాత ఆయనకు ఆ Packing లో ఉన్నది కృష్ణ భగవానుడి విగ్రహం అని దాని మీద కాళ్ళు పెట్టవద్దని, ఆయనకు ఇబ్బందిగా ఉంటే మాది ఏదయినా బెర్తు మీదకు మారితే మేము ఎవరయినా అక్కడకు వస్తామని చెప్పాము. ఆయన బెర్తు మారలేదు కానీ కాళ్ళు పెట్టనన్నాడు.

అలాగ ఆ పగలు రాత్రి గడిచినాక రైలు విజయవాడ చేరింది. ఉదయం అందరము దిగి ఉదయం అవసరాలు తీర్చుకుని టిఫిన్స్ చేసి 9 గంటలకు సింహాద్రి ఎక్సుప్రెస్ లో రాజమండ్రి చేరాము. అరుణ కుమార్ గారు రోజూ రెండు పూటలా రైలులో స్నానం చేసి స్వామి వారికి పూజాదికాలు నిర్వహించారు. రాజమండ్రిలో శివలింగాన్ని మార్కండేయ స్వామి ఆలయంలో అప్పచెప్పాము. ప్రతిష్ఠ జరిగేంతవరకూ అక్కడ పూజాదికాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.

కృష్ణ భగవానుడిని కారులో ఇంటికి చేర్చి Parcel తీసి చూశాము. ఎటువంటి Damage లేకుండా ఉంది. 2008 జనవరి నెలలో సంక్రాంతి పండుగ తరువాత ముగింపు దశలో ఉన్న అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. రోజూ 20 మందికి తక్కువ లేకుండా పనివారు రక రకాల పనులు చేస్తున్నారు. వారికి కావలసిన సరుకులు అందించడం రేపు చేయవలసిన పనులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో రోజుకి 16 గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించ వలసి వచ్చేది.

యాగశాల నిర్మాణం

11) ఆలయ ప్రాంగణం కాంక్రీటు పని, ప్రహారీగోడ, కోనేరు మెట్లు, గేట్లు, హుండీ, గురువుగారి కోసం శివకోడు

ఆలయ ప్రాంగణం కాంక్రీటు పని

ఆలయ ప్రాగణం చుట్టూ తరువాత కోనేరు మెట్లు కట్టడానికి Ramp  సుమారు 6000 అడుగులు కాంక్రీటు కొట్టవలసి ఉంది. గొల్లబాబుగారి బావగారు రామకృష్ణారావుగారిని అంతకు ముందు అందరిలాగే చందా అడిగారు. నాకు బుచ్చింపేట శివాలయంలో ఏమీ పని లేదు. నేను ఇవ్వనన్నారు. అది విన్నాక చందా కోసం ఇంకా మీ దగ్గరకు రాము అనేదాకా వ్యవహారం వెళ్ళింది. ఇది జరిగిన ఒక నెల రోజులు తరువాత ఒక నలుగురం వాళ్ళింటికి వెళ్ళాము. మాలో ఎవరికీ ఆయన్ను ఈ విషయంలో మాట్లాడే ఉద్దేశ్యం లేదు. కానీ మమ్మల్ని చూడగానే బీరువాలోంచి 20,000 రూపాయలు తీసి అడక్కుండానే ఇచ్చారు. ఆశ్చర్యపోవడం మావంతు అయ్యింది.  రెండు రోజులలో దానికి ఇంకొక 20,000 కలిపి మొత్తం 6,000 అడుగుల కాంక్రీటు 1X6 పాళ్లతో కొట్టడం జరిగింది. ఒక వారం రోజుల తరువాత ఆయన కనపడినప్పుడు ఈ విషయం చెప్పాను.

దరిమిలా వారి అబ్బాయికి ఈ ఊరి అమ్మాయినే చేసుకోవడం, వారి సంతానానికి ఈ గుడిలోనే శాంతి చేసుకోవడం జరిగింది. గుడితో పని ఉందో లేదో ఆ విధంగా స్వామివారు ఎరుక పరిచారు.

ప్రహారీగోడ, కోనేరు మెట్లు, గేట్లు

గుడి చుట్టూ ప్రహారీగోడ ఎటు చూసినా 100 అడుగులు ఉంది. 400 అడుగులు. 10 అడుగుల దూరానికి ఒక piller చొప్పున పోశాము. లోపలపక్క 6 అడుగుల దూరంలో ఒకటి వదిలి మరొక దానికి రెండవ వరస pillers పోశాము. బొమ్మలో చూపినట్లుగా బయట పిల్లర్ల మీదుగా Beams నేల మట్టానికి పోశాము. లోపల పిల్లర్లను కలుపుతూ Lock Beams పోశాము. అందువల్ల కాంపౌండ్ గోడ బయటకు కాని లోపలకు కాని వాలే అవకాశం లేకుండా బలంగా నిలబడుతుంది. ఉత్తరం గోడకు ఈశాన్యం మూల Main Gate, దక్షిణం గోడకు, పడమటి గోడలకు రెండు చిన్న gates, నైరుతి మూల ఒక 16X10 గది, అరుగు, ఉత్తరానికి రోడ్డుమీదకు ఒక shop ఉండేలాగ compound wall నిర్మించాము. తూర్పు వైపు గుడికి ఎదురుగా కోనేటిలోకి దిగటానికి 50 అడుగుల వెడల్పుతో 10 మెట్లు వచ్చేలాగ Ramp మొత్తం 8mm ఊచలతో కట్టి concrete పోశాము. ఆ తరువాత దాని మీద మెట్లు కట్టాము. అందువలన మెట్లు విడిపోవటం కాని, జారటంగాని జరుగదు.

కొంతకాలంగా ఎక్కడికి వెళ్లినా రక రకాల గేట్ల డిజైన్లు చూడటం మొదలు పెట్టాము. ఒకసారి రాజమండ్రిలో ఒకరి ఇంటికి ఇలాంటి Gate ఉండటం చూసి ఆ Design ని ఎంపిక చేశాము. గుమ్ములూరు అప్పటి సర్పంచి వెంకటేశ్వరరావు గారు Gate ఇస్తామన్నారు. Welder ని ఆ గేటు దగ్గరకు తీసుకు వెళ్లి చూపించి ఆ Design లో పెద్దగేటు తయారు చేయమన్నాము. అదే డిజైనులో రెండు చిన్న గేట్లు మేము చేయించుకున్నాము. ఈ గేట్లని కూడా 2008 సంవత్సరం ఫిబ్రవరి 8 వ తేదీ వరకు పెట్టడం కుదరలేదు. అంటే ప్రతిష్ఠకు ముందు నాలుగు రోజులు ఉందనగా మాత్రమే పని అయ్యింది.

హుండీ

—————-గారి పాత ఇనుపపెట్టి ఎండకు ఎండి వానకు తడిసి బాగా తుప్పు పట్టి ఉంది. దానిని హుండీ గా మారుద్దామని బయటకు లాగి ఒక Tyre బండికి ఎత్తాము. కోరుకొండ తీసుకువెళ్లి ఎత్తి పడేస్తే అప్పుడు తలుపు తెరుచుకుంది. దానికి వెల్డింగులు చేయించి లోపలి రేకుతో పైన డబ్బులు వేయటానికి అనుకూలంగా తయారుచేసి కొత్త తాళాలు తయారు చేయించి మక్కుపెట్టి రంగు వేశారు. ఒక్కొక్క రకం పని ఒకళ్ళు చేయవలసి రావటం వలన ఒక నెల రోజులకు కాని పూర్తికాలేదు. తరువాత దానిని మళ్ళీ టైర్ బండి మీదకు ఎత్తి తీసుకువచ్చి ఇప్పుడు ఉన్నచోట పెట్టడం జరిగింది.

గురువుగారి కోసం శివకోడు

శివకోడు గ్రామంలో ఒక గ్రామ దేవత గుడి ప్రతిష్ఠ కోసం గురువుగారు వచ్చినట్లు 2007 నవంబరులో తెలిసింది. ఆయన్ను కలవాలంటే విజయనగరం దాకా వెళ్ళాల్సివస్తుందని కొంతమందిమి కలిసి శివకోడు వెళ్ళాం. గుడి పనులు దాదాపుగా ఒక రెండు నెలలలో పూర్తికావచ్చని అంచనాతో ప్రతిష్ఠ చేయడానికి వారిని రమ్మని కోరడం, ముహూర్తం పెట్టించుకోవడం, కార్యక్రమ వివరాలు రాయించుకోవడం (ఆహ్వాన పత్రికలు ముద్రించడానికి) మొదలైన వివరాలు మాట్లాడుకోవాలని ఉద్దేశ్యం.

అయ్యా, గుడి కట్టడానికి చాలా ఖర్చయ్యింది. కొంచెం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాము. మీరు దయ తలచి కాస్త తక్కువ ఖర్చులో ప్రతిష్ఠ అయ్యేలాగా చూడమని కోరాను. ఆయనకు కోపం వచ్చింది. గుళ్ళు కట్టడానికి ఖర్చు పెట్టగలరు కాని ప్రతిష్ఠ దగ్గరకు వచ్చేటప్పటికి డబ్బులు లేవంటారు (అందరూ అలాగే అంటారేమో). ఇది కూడా పెద్ద పనే, ముఖ్యమయినదే అని తేలికగా అయ్యేది కాదని అన్నారు.

వారి అబ్బాయిగారు సంతర్పణ ఖర్చులతో సహా సుమారు నాలుగు లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుందని ఒక అంచనా చెప్పారు. 16-02-2008 ఉదయం ముహూర్తం పెట్టారు. 12-2-2008 నుండి 5 రోజుల కార్యక్రమాలు మొదలవుతాయి. యాగశాల ఎలా చెయ్యాలో, అందులో హోమ గుండాలు ఎక్కడ ఎలా ఉండాలో, అధివాసాలకు ఒక కుండీ ఎక్కడ కట్టాలో గీసి ఇచ్చారు. 30’X30′ యాగశాల తయారు చేయించమన్నారు. కాశీ నుండి నర్మద బాణ లింగం తెచ్చుకోమన్నారు.

అంతా విని సాయంత్రానికి బయట పడ్డాం. ప్రస్తుతం వేలకు లెక్కలు వెయ్యటానికే దేముడు కనపడుతున్నాడు. ఈ లక్షల ఖర్చు తప్పదని తెలిసినా ఎలా నెరవేరుతుందో తెలియదు. సమయం కూడా ఎక్కువ లేదు. మిగతా నడుస్తున్న పనులు కూడా ముగింపు దశలో ఉన్నాయి. వాటికి కూడా పెట్టుబడి ఖర్చు విపరీతంగా అవుతోంది. నిశ్శబ్దంగా తిరుగు ప్రయాణమయ్యాం. ప్రతిష్ఠకు కావాల్సిన సామాన్లు లిష్టు తరువాత విజయనగరం వచ్చి తీసుకోమన్నారు.

10) తులసి కోట, ఉత్సవ మూర్తులు

తులసి కోట

తులసి కోట కట్టడానికి అయ్యే ఖర్చు నేనిస్తానని భేరి సరస్వతి గారు అన్నారు. సాధారణంగా తులసి కోట అంటే ఒక దిమ్మలాగా కట్టి మధ్యలో ఒక తులసి మొక్కను వెయ్యటం. దిమ్మకు అలంకరణలు చెయ్యటం. కానీ ఇక్కడ అలాగ కాకుండా 10’X10′ (feet) Platform తయారు చేసి దాని మధ్యలో గుండ్రంగా రెండు అంచెలలో తులసిని పెంచి దాని మధ్యలో ఒక చిన్న గోపురం నిర్మించి అందులో కృష్ణ భగవానుడి పాలరాతి విగ్రహం పెడితే బాగుంటుందని నా ఊహ.

ఇది చెప్పి అర్థం అయ్యేలా చెయ్యడం అంత సులభం కాదు. అలాగని ఆ Design ఎక్కడా లేదు. అందువలన కొంచెం వివరించి 30,000 రూపాయలు ఖర్చవుతుందన్నాను. దానికి ఆవిడ ఒప్పుకుంది. ఆ ప్రకారం నిర్మాణం చేసి తులసి కోటకు బదులు తులసివనంలో కృష్ణ భగవానుడు కొలువు తీరి దర్శనమిస్తున్నాడు. Gate తీసుకుని లోపలికి రాగానే ముందుగా కనపడే తులసి బృందావనం, మొత్తం ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానం చేస్తోంది. కృష్ణ భగవానుడి విగ్రహం కాశీ నుంచి తీసుకు వచ్చాము. అక్కడ ఆ విగ్రహం 9,500-00 అయ్యింది. ఇక్కడ 30,000 వరకూ చెప్పారు.

im7im8

dsc_0433

ఉత్సవ మూర్తులు

పంచలోహ ఉత్సవ మూర్తులు తయారు చేయించడానికి ధవళేశ్వరం వెళ్ళాము. అక్కడ విగ్రహాలు పోత పొసే వారిని సంప్రతించాము. మేము కోరిన కొలతలలో ఈశ్వరుడు అమ్మవారు, గణపతి విగ్రహాలు చేయడానికి సుమారు 100kg ల బరువు వరకు వస్తుందని అర్థమయ్యింది. 1kg కి 1400 రూపాయలు అవుతుందన్నారు.

చిన్న విగ్రహాలు చేయించడానికి మనసు ఒప్పటం లేదు. పెద్దవి చేయించడానికి సొమ్ము లేదు. వీటి కోసం కూడా లక్ష రూపాయలు కావాలి. అసలే రూపాయలకి ఇబ్బందిగానే ఉంది. మళ్ళీ అందరికి నీరసం వచ్చేసింది.

జంగారెడ్డిగూడెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గుడికి ఉత్సవ మూర్తులను కుంభకోణంలో తయారు చేశారు. వారు విగ్రహాలు ఎంతో నైపుణ్యంగా తయారు చేస్తారు. దానికి ఎంతో నియమ నిష్ఠలను కూడా పాటిస్తారని విన్నాము. మా తమ్ముడు గారు స్వయంగా కుంభకోణం వెళ్లి ఆ విగ్రహాలు పోత పొసే కార్యక్రమం చూడటం జరిగింది. ధవళేశ్వరం నుండే ఆయనకు Phone చేసి ఇక్కడ పరిస్థితి వివరించాము. ఆయన వెంటనే కుంభకోణం వారితో మాట్లాడి Kg 700 రూపాయలకు కుదిర్చారు. సగం బరువు తగ్గినట్లయ్యింది. 30,000 రూపాయలు Advance పంపించాము. వాళ్ళది పెద్ద సంస్థ. నిపుణులయిన పనివారు ఉన్నారు. Export కూడా ఉంది. అంత కంటే ఎక్కువగా పట్టించుకునే అవకాశం కూడా మాకు లేదు.

గురువుగారు 16-Feb-2008 తారీకు నాడు ముహూర్తం పెట్టారు. 5 రోజుల ప్రతిష్ట కాబట్టి కనీసం 10-02-2008 కన్నా విగ్రహాలు ఇక్కడకు చేరాలి. వాళ్ళు ఒక 20 రోజుల ముందే విగ్రహాలను తయారు చేసి packing చేసి S.R.M.T. వారికి జంగారెడ్డిగూడెం అడ్రసుకు parcel చేసేశారు. సరిగ్గా అప్పుడే S.R.M.T. సంస్థలో కార్మికులు సమ్మె చేశారు.

సమ్మె ఎప్పుడు విరమిస్తారో తెలియదు. విగ్రహాలు కుంభకోణం నుండి మద్రాసు (చెన్నై) డిపోకు, అక్కడ నుండి కాకినాడకు తరువాత జంగారెడ్డిగూడెం చేరవలసి ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. అసలీ విగ్రహాలు ఎక్కడ ఉండిపోయాయో తెలియటం లేదు. సమయానికి చేరతాయో చేరవో. అవి రాకపోతే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు ఉంటుంది.

ఫిబ్రవరి 9 వ తారీకు కూడా వచ్చేసింది. స్వామివారి జాడలేదు. అప్పుడు sudden గా జంగారెడ్డిగూడెం చేరినట్లు Phone వచ్చింది. తెల్లవారాక విగ్రహాలను కారులో బుచ్చెంపేట చేర్చారు. అలాగ ఎంతో ఆందోళన తగ్గింది. పార్శిలు విప్పి చూశాము. బంగారం రంగులో మెరిసి పోతున్న స్వామి వారు, అమ్మవారు, వినాయకుడు దర్శనమిచ్చారు. అవి ఎంత అందంగా ఉన్నాయంటే నోట మాట రాలేదు. కాళ్ళకి దణ్ణం పెట్టుకుని హారతి ఇచ్చాము. స్వామివారి సంపూర్ణ దయ వలన సమయానికి ఎటువంటి ఆటంకం కలుగ కుండా దయ చేశారు. ఇంకొక 20 రోజుల తరువాత కానీ ఉన్నా 30,000 పంపలేక పోయాము. చీంద్రిం వెంకట కృష్ణ గారు 30,000 ఇచ్చారు.

ఆలయ ప్రాంగణం కాంక్రీటు పని

9) గ్రానైటు ఫ్లోరింగు, గంట, తలుపులు

గ్రానైటు ఫ్లోరింగు

మండపానికి, గుళ్ల లోపల టైల్సుతో కానీ పాలరాతితో కాని ఫ్లోరింగు చేద్దామన్నారు. పాలరాయి కొత్తలో బాగుంటుందేమోకాని జనం ఎక్కువగా తిరిగే చోట చాలా తొందరగా కళ తప్పి పోతుంది. అలాగ కొంచెం పాత బడిన పాలరాతి ఫ్లోరింగులను చూడమన్నాను. అలాగే Tiles (అప్పటికి vitrified టైల్స్ ప్రాచుర్యంలోకి రాలేదు) కూడా కొన్నాళ్ళు తరువాత Enamel పొతే మార్చడం కష్టం. అందువల్ల గ్రానైటు వాడదామన్నాను. కోరీ లోని లక్ష్మీనరసింహ స్వామి గుడికి అప్పట్లో గ్రానైటు వేశారు. వాళ్ళని తీసుకువెళ్లి అది చూపించాను. అందరికీ నచ్చింది. నీడ ఆనేలాగా ఉంది.

ఆ రాయి ఖమ్మంలో దొరుకుతుంది కాబట్టి ఒక రోజు అయిదుగురం ఖమ్మం మాధవరావు గారి కారులో వెళ్ళాం. ఇక్కడ మెట్లకు, మండపానికి, స్తంభాలకు ఏ ఏ సైజులు కావాలో రాసుకుని ఇంకొంచెం ఎక్కువ ఉండేలాగ 1″ (అంగుళం) మందం Z black గ్రానైటు రాయికి ఆర్డరు ఇచ్చి 30,000 అడ్వాన్సుగా ఇచ్చాము.

ఒక నెల రోజుల తరువాత, 16 టన్నుల భారీ మోతతో ఒక లారీ వచ్చింది, బాలెన్సు సొమ్ము కట్టి వచ్చి తీసుకు వెళ్ళమని Phone చేశాడు. సరుకు ఇక్కడ చేరిన వెంటనే Money Transfer చేస్తామన్నాము. నిన్ను నమ్మి 30,000 Advance ఇచ్చాము, మమ్మల్ని నమ్మి సరుకు ఎందుకు పంపలేవని అడిగాం. లారీ దిగుమతి అయిన వెంటనే ఖమ్మంలోని Account కి రాజమండ్రి SBI ద్వారా Transfer చేసి, ఫోను చేసి సొమ్ము జమ అయ్యింది చూసుకుని చెప్పమన్నాం.

ఆ తరువాత విజయవాడ నుండి పనివారు వచ్చారు. వారికి కావలసిన భోజనాలు వసతి ఏర్పాటు చేశాం. కాని కరంటు రోజులో సాగ భాగమే ఉండేది. మధ్యాహ్నం కరంటు అప్పుడు కాస్త పరవాలేదు కాని ఉదయం కరంటు అప్పుడు పని మొదలెట్టిన కాసేపటికే పొయ్యేది. అందువలన వాళ్ళ పనికి ఆటంకం కలగా కుండా ఉండేందుకు మా జనరేటర్ ని తీసుకువెళ్లి అక్కడ బిగించి కరంటు లేకపోయినా పని ఆగకుండా ఏర్పాటు చేశాము. సుమారు రెండు వారాలకు పని పూర్తయ్యింది. తరువాత అనేక డిజైన్లు వెతికి ఆలయాల లోపలి గోడలకు టైలు వర్కు చేయించాము. ఇప్పుడు చాలా వరకు ఆకారం ఏర్పడింది. ఎప్పటిలాగే మనకు తెలిసినవాళ్ళు ఉన్న పొరుగు ఊళ్లు వెళ్లి చందాలకు ప్రయత్నం కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. లోటు బడ్జటు లోంచి బయట పడటం కూడా లేదు.

గంట

మిర్తిపాడులో ———————- గంట ఇస్తామన్నారు. గంట అంటే వాళ్ళ ఊహలో 60kg ల గంట ఏమీ ఉండదు. గంట సుమారు 20,000 అవుతుందన్నాము. ఇదొక విడ్డూరం లాగ అనిపించింది. మాకేమయినా పిచ్చి పట్టిందేమో అని కూడా అనిపించి ఉంటుంది. గంట ఇస్తామన్న పాపానికి ఇంత ఖరీదు అవుతుందని అనుకుని ఉండరు. గంట కు Hyderabad ఆర్డరు పెట్టాము. 63 kg ల గంట రాజమండ్రి S.R.M.T. కి వచ్చింది. దానిని విడిపించి కారులో వేసుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి చూపించాము. తరువాత కొన్నాళ్ళకు 13,000 ఇచ్చారు. ఇప్పుడు ఆ గంట కొడితే ఊళ్ళో వినిపించని ఇల్లు అంటూ ఉండదు. దానికి Stand వడ్రం మేస్త్రీ చేసి ఇచ్చాడు.

dsc_0452

తలుపులు

మిగతా అన్ని పనులు ఏదో ఒక రకంగా అవుతున్నాయి కానీ తలుపులు కట్టించే పని ఒక కొలిక్కి రావటం లేదు. దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి మల్లేపల్లి గిరిబాబు గారు తలుపులు చేయిస్తానంటున్నారు. వారి ఇంట్లో ఒక పెద్ద దుంగ ఉంది మేస్త్రిని పంపండి అనేవారు. ఎన్నాళ్లయినా పని ఒక్క అడుగు కూడా కదల లేదు.

తలుపులు, బయట చట్రాలకు డిజైన్లు అంతా చాలా సమయం తీసుకునే పని. ఇంకా Late చేసే అవకాశం లేదు. అందువల్ల దానికి కావలసిన కలప సీతానగరంలో కొందామని మేస్త్రి సలహా ఇచ్చాడు. దాని ప్రకారం సీతానగరం అడితిలో ఒకే రంగు ఉన్న కర్రలలో సైజులు కోసి ఇవ్వడానికి మాట్లాడుకున్నాము. ఆ మరునాడు వడ్రం మేస్త్రీ గారు రాసుకు వచ్చిన సైజులు ప్రకారం బాగా ముదురు రంగు ఉన్న పెద్ద పెద్ద టేకు దుంగల నుండి సైజులు కోయటం మొదలు పెట్టారు. ఏదయినా కర్రలో లేత రంగు తగిలితే వదిలేసి మంచి ఎంపిక చేసిన కర్రలలో  కావలసిన సైజులు కోసి ఇచ్చారు. ఒక పెద్ద దుంగలో లోపల అంతా తొర్రే ఉంది.

దానికి సుమారు 50,000 రూపాయలు అయినాయి. గండేపల్లిలో పనిచేయడానికి, బుచ్చింపేట గుడిలో ఉపయోగించుకోవడానికి వీలుగా ఫారెస్టు పర్మిట్లు తీసుకున్నాము. ఆవిధంగా కోసిన సరుకు గండేపల్లి చేరింది. పని వెంటనే ప్రారంభించేశారు.

ఆ మరునాడు రెండు కార్లలో మేము రాజమండ్రిలో గొల్లబాబు గారు ఉంటున్న ఇంటికి వెళ్ళాము. అప్పుడే సరిగ్గా గొల్లబాబు, గిరిబాబు ఒకే Motor Cycle మీద బయటకు వెళ్ళుతున్నారు. మమ్మల్ని చూసి వెనక్కు వచ్చారు. తలుపులు తయారు చెయ్యడానికి కలప తీసుకున్న సంగతి చెప్పాము. దానికి అయిన ఖర్చు ఇచ్చేయడానికి సమ్మతించారు.

ఇప్పుడు అర్థం అయ్యింది స్వామి వారి లీల. ఏడాది పాటు తలుపులు ఎందుకు తయారవ్వలేదో! ఆయన దగ్గర వున్న దుంగ చాలదు. దాని జతకి ఏదో ఒకటి కాని ఏదో Quality తలుపులు తెచ్చి ఇస్తే వాటిని బిగించలేము, అలాగని వదిలెయ్యలేని పరిస్థితి. ఇంత Quality తలుపులు, బయటి చట్రం చెక్కడాలు తయారవ్వాలంటే ఏది మార్గమో చూపించారు. సరిగ్గా సమయానికి రెండు రోజుల ముందు తలుపులు తయారవ్వటం, బిగించడం జరిగిపోయింది.

8)గుడి చుట్టూ పల్లాన్ని మెరక చేయడం

2007 వ సంవత్సరం వానాకాలం ముగింపు దశకు వచ్చింది. కొద్ది రోజులలో వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభం కానున్నాయి. జనం ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ట్రాక్టర్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ అదను దాటితే మళ్ళీ కొన్ని నెలల దాకా మనుషులు ట్రాక్టర్లు రద్దీ కారణంగా పని కష్టం అవుతుందని పని మొదలు పెట్టాము. నేల మెత్తగా ఉంది. తోలే మట్టి కూడా తడిగా ఉంది. అందువలన లోపలకు వచ్చిన ట్రాక్టరు తొట్టిని తిప్పుకోలేదు. అందువలన మా ట్రాక్టరును వేరేగా పెట్టి కేవలం దిగిపోయిన ట్రక్కును వెనక్కు లాగటానికి వినియోగించాము. ఒక్కొక్క ట్రాక్టరు మట్టితో రావటం, మట్టిని దింపాక ట్రక్కును వెనక్కి లాగటం పంపటం, ఈ లోపల మరొక్క మట్టిలోడు. ఇలాగ కాస్త ఉత్సాహంగా, ఉద్వేగంగా, గందరగోళంగా పని జరుగుతోంది.

ఎప్పటిలాగే డబ్బులు ఇబ్బందిలోనే ఉన్నాయి. ఒక చోటనుండి ఒక లక్ష రూపాయలు అప్పుగా తెచ్చి పనులు కొనసాగిస్తున్నాము. మొదటిరోజు కొంతపని అవ్వగానే బాదే రామచంద్రం గారు చూడటానికి వచ్చారు. ఈ మట్టితో మెరక చెయ్యటం అంత అర్జంటు పనిలాగా కనపడలేదు. ఇంకా చెయ్యాల్సిన పనులు బోలెడు ఉండగా ఈ మట్టికి కంగారేమొచ్చిందని గడబిడ చేశాడు. అంతటితో ఆగకుండా సెంటరులోకి వెళ్లి అందరితో వివాదం మొదలు పెట్టాడు. ఇదంతా చూస్తున్న పనివాళ్ళు మేము రేపటి నుండి మట్టి తోలం అన్నారు. అలా అని ఆయన మాటలు విని పని ఆపు చెయ్యమని చెప్పటానికి ఎవరూ రాలేదు. అప్పుడు నేనేమన్నానంటే “మట్టి తోలించేది నేను, డబ్బులు ఇచ్చేది నేను. మనం ఏపని చేసినా నచ్చని వాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఏపనులు అవ్వవు. ఏదయినా గొడవలు వస్తే నేను చూసుకుంటాను. మీరు మట్టి తోలటం ఆపు చెయ్యక్కర్లేదు”. అంతే మరునాటి నుండి ఇంకా ట్రాక్టర్లు జనం పెరిగారు. మొత్తం 300 ట్రాక్టర్ల మట్టి తోలటం జరిగింది. తరువాత రెండు రోజులు మరొక 30 ట్రాక్టర్లు పల్లాలు మెరకలు సమానం చేసుకుంటూ రోడ్డు లెవలు దాకా మెరక చేయటం జరిగింది. అప్పుడు అంతా చక్కటి ఎర్రటి మైదానం తయారయ్యింది. కొన్ని రోజులు ఆరిన తరువాత మిర్తిపాడు వెళ్ళే రోడ్డు రిపేరు జరుగుతోంది. అక్కడ రోడ్డు రోలరు ఒకటి పనిలో ఉంది. ఆ కాంట్రాక్టరు గారిని అడిగి ఆ రోలరుని తీసుకు వచ్చి మట్టి అంతా బిగుసుకునేలాగ సమానంగా సానలాగా తొక్కించాము. అప్పటికి గొయ్యి అంతా పూడుకుపోయి అందమయిన గట్టి మైదానం ఏర్పడింది. గొడవలు చేసిన వాళ్ళు మాట్లాడకుండా ఊరుకున్నారు.

im2im1

7)ధ్వజస్తంభం

బాదే వెంకటప్పారావుగారి తోటలో ఒక టేకు చెట్టు నిటారుగా పొడవుగా పెరుగుతోంది. అది ధ్వజస్తంభానికి సరిపోతుంది అని అనేవారు. దానిని కొట్టించి, చెక్కించి ఇత్తడి తొడుగు వేయించేదాకా నాదే బాధ్యత అని చెప్పేవారు. మేము ఒకసారి చూడటానికి వెళ్లాం. మాకు కూడా చాలా నిటారుగా బాగా కనపడింది. ధ్వజస్తంభం కోసమే పుట్టింది అన్నట్లు ఉంది. ఒక సమస్య చాలా తేలికగా వదిలి పోయింది అనుకున్నాం.

కొంతకాలం తర్వాత గుడి దగ్గర ఎంత పొడవు కర్ర కావాలో లెక్క వేశాం. 36 అడుగుల కంటే తక్కువ పొడవు ఉన్నది పనికిరాదని తేలింది. మళ్ళీ తోటలోకి వెళ్లి ఒక మనిషిని చెట్టు ఎక్కించి పొడవు కొలిపించాము. అది 25 అడుగులు మాత్రమే ఉంది. దాంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. ఎంతో పొడవు ఉన్నట్లు కనపడినది 25 అడుగులే ఉంటే 36 అడుగులు ఉన్నది ఇంకా ఎంత పెద్దదిగా ఉంటుందో కదా అని మొదటిసారి అనిపించింది. అంత పెద్ద చెట్టు దొరకడం అంత తేలికయిన పని కాదని అర్థం అయ్యింది.

అందరం గుడి దగ్గరకు తిరిగి వచ్చాక నేల మీద కూలబడ్డాం. అంత ఎత్తు చెట్టు తేలేము కానీ కాంక్రీటు స్తంభం పోసేసి ఇత్తడి తొడుగు వేద్దాం అన్నాను. దానికి మిగిలిన వాళ్ళు ఒప్పుకోలేదు. మాకు తెలిసిన బంధువు ఒకరు సూదికొండ ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ గారు ఒకరు ఉన్నారు. అక్కడకు రేపు వెళ్లి సంప్రదిద్దామన్నారు. నాకు ఏమాత్రం నమ్మకం లేక పోయినా సరే అన్నాను.

మరునాడు ఒక నలుగురం సూదికొండ వెళ్లాం. ఆరోజు D.F.O. గారి విజిట్ ఉండటం వల్ల సాయంత్రం వరకు మాకు ఆఫీసర్ గారు దొరకలేదు. సాయంత్రం ఆయన మమ్ములను చూసి ఏం పని మీద వచ్చారని అడిగారు. ధ్వజస్తంభం అవసరం గురించి ఆయనకు చెప్పారు. అది ఒక పెద్ద టేకు అడివి(plantation). అందులో ఒకే ఒక చెట్టు తుపాను గాలికి వేళ్ళతో సహా లేచి పడిపోయింది. కొన్ని వేల చెట్లలో అది తప్ప మిగిలినవన్నీ బాగున్నాయి. అంటే తుపానుకు దెబ్బతినకుండా నిలబడి ఉన్నాయి. దానిని మొదట చూసిన వాచర్ ఒక ముస్లిం. ఆ చెట్టు చాలా బాగుంది, ధ్వజస్తంభానికి బాగుంటుందని చెప్పాడంట. అది మీకేమయినా పనికి వస్తుందేమో మమ్మల్ని చూసి రమ్మన్నారు. అది రోడ్డుకి దగ్గర్లోనే, అంటే సుమారు 200 అడుగుల దూరంలో ఉంది. ఒక పక్కన చీకటి పడటానికి ఎంతో సమయం లేదు. ఆ వాచర్ ని మాకోసం రోడ్డుమీద నిలబడమన్నారు.

మేము చీకటి పడిపోతుందేమోనని కంగారుగా వెళ్ళాము. అతను మమ్మల్ని చెట్టు దగ్గరకు తీసుకువెళ్లాడు. దారంతా అడుగు మందం రాలిపోయిన టేకు ఆకులు ఉన్నాయి. వాటి క్రింద ఏముందో కూడా తెలియదు. అయినా వాటిని మేము తొక్కుకుంటూ వెళ్ళాము. అప్పడాలు విరిగి పోతున్నట్లు చప్పుడు అవుతోంది నడుస్తుంటే. కొద్దిపాటి వెలుతురులో ఆ పడిపోయిన చెట్టును చూశాము. అది ఒక బ్రహ్మాండమయిన వృక్షం. పడిపోయినప్పుడు పైకి లేచిన వేళ్ళే 10 అడుగుల పొడుగు ఉన్నాయి. చెట్టు 36 అడుగులదాకా pencil లా తిన్నగా భారీ సైజుతో ఉంది. అక్కడ నుండి వంపుతో మొత్తం 42 అడుగులు ఉంది. దాన్ని చూడగానే ఆశ్చర్యం వేసింది. వెంటనే దానికి దండాలు పెట్టుకుని కళ్ళకద్దుకుని ఆఫీసరు గారి బంగళాకు తిరిగివచ్చాము.

మాకు అది సరిపోతుందని చెప్పాము. దానికి ఆయన ఏమన్నారంటే, అది తుపానుకు పడిపోయింది కాబట్టి మీకు ఇవ్వగలము. లేకపోతే కొట్టడానికి ఎవరికీ అధికారము లేదు. దాన్ని మేము photos తీసి పైకి పంపించి వారి అనుమతి వచ్చాక దీనిని వంపు దగ్గర కొట్టించి డిపోకి తరలిస్తాము. దీనిని ముక్కలు చెయ్యకుండా Depot లోకి చేర్చడం కూడా చాలా కష్టమయిన పని. ఆ తరువాత పాటలు ఎప్పుడు పెడతారో కబురు చేస్తాను. అప్పుడు వచ్చి పాడుకొండి, అప్పుడు కొంచెం సాయం చేస్తాను. ఈ లోపల మా పై ఆఫీసరుగారు మరెవరికయినా మాట ఇవ్వకుండా నేను మాట ఇచ్చానని చెబుతాను. దీనికంతా కనీసం నాలుగు నెలలు సమయం పడుతుందన్నారు. మేము సరేనని ఇంటి ముఖం పట్టాము. అన్ని వేల చెట్లలో ఒక్క చెట్టే పడటం. అది కూడా మన అవసరానికి తగినట్లు ఉండటం దానిని తేలిగ్గా గుర్తించ గలగటం ఇదంతా ఆయన దయవల్ల మాత్రమే జరిగిందని వేరే చెప్పనవసరం లేదు. ఆయన ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముందుండి నడిపిస్తున్నారని అర్థం అయిపోతొంది. వెనక నడవటమే మన పని.

అప్పుడప్పుడు ఆదారికి వెళ్ళినప్పుడు ఆగి ఆకర్రను చూసేవాళ్ళం. దానిని డిపోకు చేర్చాక కూడా చూశాం. కొన్నాళ్ళకు పాట జరిగే తేదీ తెలియజేసారు. ఒక వారం రోజులు సమయం ఉంది. నేను వెంకటప్పారావు గారిని కలిసి వివరం చెప్పి ఆరోజుకి సొమ్ము సిద్ధం చేసి ఉండాలని, వెళదామని చెప్పా. ఆయన సరే అన్నా నాకు నమ్మకం కలగ లేదు. నేను Bank లో Gold loan పెట్టా. ఏదయినా తేడా వస్తే ఉపయోగ పడుతుందని సిద్ధంగా ఉన్నాను.

అనుకున్నట్లే అయింది. ఆయన సొమ్ము సిద్ధం చేయలేదు. రానులేదు. ముందురోజు రాత్రి మాధవరావు గారి తండ్రిగారికి stroke రావటం వలన ఆయన రాజమండ్రి ఆసుపత్రి లో ఉన్నారు. అందువలన ఆయన కాని వారి కారు కానీ అందుబాటులో లేరు. ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. అప్పటికప్పుడు బూరుగుపూడి Taxi ని ఏర్పాటు చేసుకున్నాము. అదృష్టం కొద్దీ అదయినా దొరికింది. కొంచెం భోజనం తయారు చేసుకుని 5 గురం బయలుదేరాము. సూదికొండ డిపోలో రేంజరుగారిని కలిశాము. అనేక లాట్లు Auction లో ఉన్నాయి. మీది ఆఖరులో పెట్టాము. మీరు అక్కడ ఉండండి అన్నీ అయిపోయాక వస్తామని చెప్పారు. మధ్యాహ్నం ఒక చెట్టు క్రింద భోజనం చేసి మా లాటు దగ్గర కూర్చున్నాము.

చాలా సేపటికి మిగతా లాట్ల Auction ముగించుకుని మేము ఉన్నచోటికి వచ్చారు. అప్పుడు రేంజర్ గారు ఉన్నవాళ్ళందరితో ఇలా అన్నారు. ఇది బుచ్చింపేట శివాలయం ధ్వజస్తంభం కోసం నిర్ణయించాము. ఎవరూ పాడవద్దు”. గవర్నమెంటు లెక్క ప్రకారం దాని ఖరీదు సుమారు 80,000 రూపాయలు కట్టారు. ఈ లోపల ఒకాయన పై  పాటకు సిద్ధం అయ్యాడు. ఆయన్ను వారించి, ఒక వంద రూపాయలు అతని చేత పాడించి, అంత కంటే మరొక వంద రూపాయలు కలిపి మాకు ఖాయం చేశారు. సంతకాలు తీసుకున్నారు. వెంటనే ఆఫీసులో నాలుగవ వంతు ధర చెల్లించి మిగిలినది నెల రోజులలో Bank లో D.D. తీసి ఇచ్చి తీసుకువెళ్లాలని చెప్పారు. ఆపని పూర్తి చేసి వాళ్ళిచ్చిన రసీదులు తీసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చాము. గడువు పూర్తయ్యేలోపల ఉన్న Amount కి D.D. లు తీసుకున్నాము.

ఎలా తీసుకు రావాలి?

ఒక ట్రాక్టరు రెండు ట్రక్కులు అయితే సాధ్యమవుతుందని నిర్ణయించాం. ముందు ట్రక్కు వెనకాల Hook ఉన్నది. దానికి రెండవ ట్రక్కు డ్రాబారు తగిలిస్తే ఒక ట్రాక్టరు లాక్కుని వెళ్ళవచ్చు. మొత్తం దారిలో 6 టర్నింగులు ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగా తిరిగితే ఇబ్బంది ఉండదు. టర్నింగుల దగ్గర Traffic ని ముందుగా అదుపు చేయాలి. మొత్తం ఒక వంద మంది పైన బయలుదేరారు. అందరికీ ఇక్కడ వంటలు వండించి తీసుకు వెళ్ళాము. సన్నాయి మేళం పెట్టి, వారికి ఒక Truck ఆటో పురమాయించాము. అందరం మోటారు సైకిళ్ళ మీద, ట్రాక్టరు మీద బయలు దేరాం. ఇంత మంది జనం ఉన్నారు కాబట్టి ధ్వజస్తంభం కర్రని ట్రాక్టరు మీదకు ఎగుమతి చెయ్యటం(ఎత్తడానికి) ఇతరత్రా ఏ ప్రయత్నాలు అక్కర్లేదని మా అబ్బాయి అభిప్రాయం. అంతమంది కలిసినా ఎత్తలేరని నా నిశ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే పట్టు చిక్కడానికి కష్టం. ఒకవేళ కొంచెం ఎత్తినా అలవాటు లేని వాళ్ళు జంకితే బరువు ఎక్కువ అయి వదిలేస్తారు. ఎవరి మీదయినా పడితే ఏ చేతులో విరిగిపోయే ప్రమాదం ఉంది. అందువలన (chain pulley block with tripod) బోర్లలో మోటార్లని దింపడానికి ఉపయోగించేదానిని, ఆ మనుషులు ముగ్గురుని కూడా రమ్మన్నాను.

జనం, ట్రాక్టరు ట్రాలీలు అంతా సూదికొండ ఫారెస్ట్ డిపో దగ్గరకు చేరుకున్నాం. అందరూ ధ్వజస్తంభాన్ని చూసి చాలా ఆనందించారు. మేము D.D. లు ఆఫీసులో ఇచ్చి, రసీదులు ఫారెస్టు పర్మిట్లు తీసుకున్నాము. జనం కర్రకంతా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం వేసి హారతి ఇచ్చి మేళంతో మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. అందరూ తెచ్చిన భోజనాలు చేసి(వడ్డించిన నలుగురుకి ఏమీ మిగల్చకుండా తినేసి) చెట్ల నీడన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయారు. అప్పుడు అర్ధమయింది ఇందులో నిజంగా దుంగను పైకెత్తటానికి పనికొచ్చేవారు ఎంతమంది ఉన్నారో అని.

stambham_snippet

Chain pulley block ఉండటం వలన పెద్ద శ్రమ లేకుండా దుంగ మొదలు భాగంలో 15 అడుగులు వదిలి పెట్టి Tripod  నిలబెట్టి chain వేసి pulley block తో మెల్లిగా ఒక 6 అడుగుల ఎత్తు లేపారు. తరువాత ట్రాక్టరు మొదటి ట్రక్కుని దాని క్రిందకి తోసి దాని మీదకు దుంగని దింపారు. ఈసారి రెండవ వైపు లేచేలాగ పుల్లీ బ్లాకును జరిపి రెండవ ట్రక్కును దాని క్రిందకు తోసి డ్రాబారు ను మొదటి ట్రక్కు వెనకాల రింగులో పెట్టి Pin పెట్టేశారు. దానితో కర్ర ఎగుమతి ఒక అరగంటలో అయిపోయింది. మేళ తాళాలతో గేటు దాకా రమ్మని Forester గారిని కోరాము. ఆప్రకారంగా ఆయన కూడా జనంతో పాటు భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభానికి వీడ్కోలు చెప్పారు. దారిలో 2 check post లకు తనిఖీ కోసం ఆపవద్దని సమాచారం పంపించారు. జనం జాగ్రత్తగా ట్రక్కుల మీద కూర్చున్నారు. ముందు మేళం ఆటో బయలుదేరింది. గ్రామాలు తగిలినప్పుడు మాత్రమే వాయించ మని చెప్పాము. టర్నింగుల దగ్గర కర్ర ఆచివరకు ఈచివరకు అవసరాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పాము. Permits తీసుకుని ముందుగా Motor Cycle  మీద రెండు చెక్ పోస్టుల వద్ద చూపించి stamping చేయించాము. అందువలన వెనకాల వస్తున్న ట్రాక్టరుకు ఆగవలసిన పని లేకుండా నిదానంగా వచ్చేసింది. బూరుగుపూడి దగ్గర టర్నింగు కొంచెము ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాము కానీ జాగ్రత్తగా కర్ర బుచ్చింపేట చేరిపోయింది.

కొత్తూరు వినాయకుడి దగ్గర ఆపాము. అప్పటికే అక్కడకు చేరిన ఆడవారు హారతులిచ్చి స్వాగతం పలికారు. చీకటి పడిపోయింది. అక్కడ నుండి మేళం వారు నడుచుకుంటూ ముందు దారి తీస్తే మిగతా వాళ్ళం అంతా నడుచుకుంటూ కూడా గుడి దగ్గరకు తీసుకు వెళ్లి దక్షిణం భాగాన ఖాళీలో ఏవిధంగా ఎక్కించామో అదే విధంగా దింపి వేయడం జరిగింది. ఆ మరునాడు కర్రతో పందిరి వేసి తాటాకు కుట్టించాము. ఈ విధంగా ధ్వజస్తంభం కర్ర అడివి లోంచి గుడి దగ్గరకు చేరింది. తరువాత కొన్నాళ్ళకు పై బెరడు ఒక అంగుళం తీసేసి బాడిత పని వారు చేవ ఉండేలాగ తయారు చేసి నల్ల రంగు పూశారు.

ఇత్తడి తొడుగు:

ఇత్తడి తొడుగు తయారు చేయించడానికి కావలసిన ఇత్తడిని ఇళ్లనించి సేకరించుదామని నిర్ణయించాం. అప్పటికే ఇళ్లల్లో ఇత్తడి వాడకం తగ్గిపోయింది. అయినా చాలా మందికి సంవత్సరానికి ఒకసారి తళ తళ లాడే లాగా తోముకుని బోర్లించుకునే అలవాటు పోలేదు. అందుకని ఒక బండి పెట్టుకుని వీధుల్లో ఇంటింటికి ఆగి పనికిరాని ఇత్తడి సామాను ఇమ్మని అడిగాం. కొంత చొరవ ఉన్న వాళ్ళు లోపలికి వెళ్లి ఏదో ఒక పళ్ళెమో బిందో తెచ్చి పడేసే వాళ్ళు. అలాగ ప్రతి ఇంటి నుండి ఎంతో కొంత ఇత్తడిని సేకరించారు. మరి కొన్ని రోజులు ఒక ట్రక్ ఆటో పెట్టుకుని చుట్టు పక్కల ఊళ్ళల్లో కూడా తిరిగారు. బిందెలు, చెంబులు, పళ్ళాలు, గ్లాసులు ఇలాగ ఎన్నోరకాల చిన్న పెద్ద సామాన్లు వాడకంలో లేనివి చాలా వచ్చాయి. కొంత మంది బియ్యం కూడా ఇచ్చారు. అలా సేకరించిన సామాను మొత్తం 20 బస్తాలలో వేసి కుట్టారు. వేటినీ పాడు చెయ్యలేదు. ఆ సామానునంతా రెండు ట్రక్కుఆటోల్లో వేసుకుని రాజమండ్రి ఇత్తడి కొట్టులో దింపి కాటా పెట్టించాము. దాని విలువకు సరిపడ కొత్త మందపాటి ఇత్తడి రేకులను ధ్వజస్తంభం తొడుగు తయారు చేయడానికి కుదుర్చుకున్నసూరిబాబుకు (మండపేట) అప్పజెప్పాము. పని పూర్తయ్యేటప్పటికి సుమారు 4,000 రూపాయలు విలువ చేసే రేకు మాత్రమే కొని ఇవ్వవలసి వచ్చింది. భక్తుల ఇళ్లల్లో ఉండే పనికిరాని ఇత్తడి వస్తువులకు స్వామివారి ధ్వజస్తంభానికి తొడుగుగా మారే భాగ్యం కలిగింది. ఆ తొడుగు ఎన్నో సంవత్సరాలు ఉండేంత మన్నికతో అత్యంత సుందరంగా తయారు చేయబడింది. ఇందులో కొంతమంది తమ ఇత్తడిని చొరవచేసి కలపలేకపోయిన వారు ఉన్నారు. వాళ్లకు ఈ భాగ్యం తరువాత ఏమి చేసినా కలుగదు. దానితో పాటే ఆలయ గోపురాల మీద పెట్టటానికి కలశాలు, ధారాపాత్ర, మకర తోరణాలు, 108 చిన్న శివలింగాలు పెట్టడానికి Plate విడి విడిగా చేయించ బడ్డాయి.

6) విగ్రహాలు తయారీ

గుడి నిర్మాణం పని చురుగ్గా జరుగుతుండటం వలన ఇతర అవసరాల కోసం ప్రయత్నం మొదలు పెట్టాం. భారత శిల్ప నిలయం వాళ్ళు వచ్చి మాట్లాడు కున్నారు. వినాయకుడు, పానుపట్టం, అమ్మవారు, నందీశ్వరుడు, ద్వార పాలకులు, బలి పీఠం, చండీశ్వరుడు, నవ గ్రహాలు. వారి సలహా ప్రకారం వినాయకుడు, పానుపట్టం, అమ్మవారు, నందీశ్వరుడు గ్రానైటు రాయితో తయారు చేసేలాగ మిగిలినవి గౌరీపట్నం రాయితో చేసేలాగ సుమారు రెండు లక్షల రూపాయల ఒప్పందం కుదిరింది. మళ్ళీ మాములే, రూపాయలు అయితే లేవు. ఇవి తయారుకు 6 నెలలకంటే ఎక్కువ సమయం పడుతుంది. నిజానికి ఒక సంవత్సరం తీసుకున్నారు. మిగతా పనులతో భాగంగా ఇవి చెక్కాలి కాబట్టి, మాకు కూడా డబ్బులు పూడటం అంత సులభం కాదు కాబట్టి మేము కూడా ఏమి తొందర పెట్టలేదు.

వినాయకుడిని ఇవ్వడానికి శ్రీ చప్పిడి రామకృష్ణ గారు ముందుకు వచ్చారు. అయన దృష్టిలో ఒక 5 వేల రూపాయలతో విగ్రహం చేయించి, ఒక రోజు గుడిలో పెట్టేసి, ఒక 50 మందికి భోజనం పెట్టేద్దామని ఆలోచన. దాంతో ఆయన పని అయిపోతుందనుకున్నారు. కానీ మేము order ఇచ్చిన విగ్రహం 30,000 రూపాయలు. తరువాత ఎవరి విగ్రహం వాళ్ళు పెట్టుకు పోవడం కాదు. అన్నింటికీ కలిపి జీవ ప్రతిష్ఠ జరగాలి. ఆయన ఆలోచనలో పడ్డారు. కొన్నాళ్లకు ఆయన కొడుకులతో సంప్రదించి ఒక రోజు రమ్మని phone చేశారు. మేము కొన్ని పళ్ళు అవి కొనుక్కుని వాళ్ళ ఇంటికి రాజమండ్రి వెళ్ళాము. ఆయన అప్పటికే 30,000 రూపాయలకు చెక్కురాసి మాకోసం ఎదురు చూస్తున్నారు. మేము వెళ్లిన వెంటనే చెక్కు ఇచ్చేసి, మేము ఇచ్చిన పళ్ళు తీసుకుని పంపేశారు. ఆ cheque ని వెంటనే బ్యాంకులో collection కి ఇచ్చి ఆ సొమ్ము రాగానే శిల్పనిలయం వాళ్ళకి ఇచ్చేసి రసీదు తీసుకున్నాము.

అలాగే మా బంధువు (రాజమండ్రి) ఒకసారి 15,000 మరొకసారి 10,000 రూపాయలు ఇచ్చాడు. వస్తూ వస్తూ ఆ సొమ్ము కూడా వారికి ఇచ్చేసి రసీదు తీసుకున్నాము. ఇలా దఫ దఫాలుగా సొమ్ము జమ చేసుకుంటూ వస్తున్నాము. ఒక రోజు సాయంత్రం యర్రంశెట్టి రాంబాబు గారు నంది విగ్రహానికి నేను పెట్టుకుంటానన్నారు. అది ఒక 45,000. పానుపట్టానికి దిడ్డి మాధవరావు గారు 40,000 ఇచ్చారు, నవ గ్రహాలకు పోలిన సర్వేశ్వరరావు గారు, శ్రీహరి గారు 40,000 ఇచ్చారు.

ఇంకొక 20 రోజులలో ప్రతిష్ఠ జరుగుతుందనగా ఒకాయన కార్లో వచ్చి గుడి దగ్గర ఆగాడు. ఆయనెవరో నాకు తెలియదు. గుడి గురించి వివరాలు అడుగుతూ ఒక అరగంట ఉండిపోయాడు. నేను కూడా ఏదో మాట్లాడుతూ సమాధానాలు చెబుతున్నాను. ప్రతిష్ఠ ఇంకొక 20 రోజులలో ఉందన్నాను. అదేంటండి నాకు ఇప్పుడే దేముడు వచ్చేసినట్లు అనిపిస్తోంది. నేను ఎక్కడా 5 నిముషాల కంటే ఉండను. అప్పుడే అరగంట గడిచి పోయింది. నాకేమి లేదా? అని అడిగాడు. ఆ ప్రశ్నని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియలేదు. ఇంకా అమ్మవారి విగ్రహానికి ఎవరూ పేరు పెట్టలేదు అన్నాను. అయన వెంటనే అమ్మవారంటే మా ఆవిడకు చాలా ఇష్టం. అందుకోసమేనేమో మాకోసం ఉండిపోయినట్లుంది. అదెంతవుతుందో మేము కడతాం అన్నాడు. 30,000 రూపాయలు అవుతుందన్నాను. దానికి ఆయన ఒప్పుకున్నాడు. ఒక జత మంగళ సూత్రాలు కూడా చేయించాడు. తరువాత ఆయన పేరు మంగారావు అని తెలిసింది.

ఏంటీ మంగారావు 30,000 ఇస్తానన్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది అని కొందరు ఆయన్ను ఎరిగినవారు అన్నారు. ఏది ఏమయినా, ఆయన ఎలాంటి వాడయినా ఒక అరగంట వ్యవధిలో ఒక అపరిచితుడు(నాకు) ద్వారా స్వామివారు 30,000 ఇప్పించారు. ఇలాగ ఇంచు మించుగా శిల్ప నిలయం వారికి ఇవ్వాల్సిన సొమ్ములు ఒక సంవత్సర కాలంలో ఎప్పుడు అందినవి అప్పుడు జమ చేయగలిగాము.

ధ్వజస్తంభం

5) పని మళ్ళీ మొదలయ్యింది

చుట్టూ రైలింగు పని జరుగుతుంటే కొంచెం అందం పెరిగింది. కొద్ది కొద్దిగా జనం వచ్చి చూసి వెళ్లడం మొదలు పెట్టారు. తిబిరిశెట్టి వెంకటేశ్వర రావు – శివ అనే వాళ్ళు గోపురాలు కట్టి నిర్మాణానికి గుడి ఆకారం ఇవ్వడానికి (శిల్పులు) వచ్చారు. Material మనం ఇచ్చి పనికి Rs.1,20,000/- ఇవ్వడానికి కాంట్రాక్టు ఇచ్చాము. ఒక వెయ్యి రూపాయలు advance ఇమ్మన్నారు. ఆ వెయ్యి రూపాయలు కూడా fund గా లేదు. సరే నేను వాళ్ళను మా ఇంటికి తీసుకువెళ్లి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి పంపేశాను.

పని ప్రారంభించడానికి రెండు సైజుల ఇటుకలు ఆలమూరు నుండి మూడు లారీలు తెప్పించమని అలాగే రెండు లారీలు ఇసుక ఒక వంద బస్తాలు సిమ్మెంటు సిధ్ధం చేసుకుని కబురు చేస్తే వచ్చి పని మొదలు పెడతామని వెళ్లిపోయారు.

Advance ఇవ్వటానికే వెయ్యి రూపాయలు ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో ఇవన్నీ ఎప్పటికి సమకూరుతాయో కదా ఏమో ఏం జరుగుతుందో –

మెల్లి మెల్లిగా రైతుల్లో భగవంతుడు కదలిక తీసుకువచ్చాడు.రూపాయలు రావటం మొదలు పెట్టాయి. కావలసిన సరుకులు సమకూర్చుకుని వారికి ఫోన్ చేశాము. మొదట వాళ్ళు slab క్రింద భాగంలో స్తంభాలను తీర్చిదిద్దడం, మండపం పనులు, గదుల బయట డిజైన్లు చేయటం ప్రారంభించారు. వీటి గురించి మాట్లాడకపోవటం వలన వారి కూలి పనుల క్రింద లెక్క చూసి ఇవ్వటం మొదలు పెట్టాము.

వెంకటప్పారావు గారి ఎలక్షను.

2007 లో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. బాదే వెంకటప్పారావు గారు ఆయన భార్య తరపున ఎన్నికలలో ఉన్నారు. గెలిస్తే ఖర్చులు పోను సుమారు 7 లక్షలు గుడికి వచ్చేలాగ ఉన్నాయి. ఎన్నికలు గుడికి అనుకూల వర్గం వ్యతిరేక వర్గంగా విడిపోయింది. ఏదోరకంగా గుడికి సొమ్ము సమకూరేలాగ ఆలోచించేవాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఋజువయ్యింది. ఎలక్షనులో నెగ్గటం వలన మాట ప్రకారం 7 లక్షలు సమకూర్చాలి. ఖర్చుకు సరిపడినంతగా ఇచ్చేలాగ వెసులు బాటు ఇచ్చాము. కాని సమయానుకూలంగా సరిపెట్టలేకపోవడం వలన అన్ని మార్గాల ద్వారా అందే చందాల కంటే ఖర్చు వేలు లక్షల మీద ఎక్కువగా ఉండేది. చందాలకు కూడా అపరిచయస్తుల దగ్గరకు వెళ్ళలేదు. అది ఒక యాచన క్రిందకు వస్తుంది. ప్రయోజనం కూడా అంతంత మాత్రంగా ఉంటుందని అర్థమయ్యింది, అందువలన ఈ ఊరికి సంబంధించిన వ్యక్తుల బంధువర్గం నుండి వారి ద్వారానే ప్రయత్న చెయ్యడం మొదలు పెట్టాము.   అందువలన కొంత ప్రయోజనం కనపడింది. ఆ వసూలు చేసి తెచ్చే బాధ్యతను కూడా వాళ్లే తీసుకున్నారు. నేను నా బంధువుల నుండి సాధ్యమయినంత సేకరించడం మొదలు పెట్టాను. కొంచెం ఇదంతా ఇబ్బందికరమైన పరిస్థితే. ఒకరిని అడగటం అలవాటు లేని పని, అయినా తప్పలేదు. ఆ సమయానికి ఆ పరమాత్మ కృపవలన  వారిలో దానగుణం కలిగి చందాలు ఇవ్వటం జరుగుతుంది,

విగ్రహాలు తయారీ:

 

4) ఆగిపోయింది

మన దగ్గర ఉన్న రెండు లక్షల రూపాయలు పని ప్రారంభించాడానికి ఇబ్బంది లేని నిధిగానే భావించాను కానీ తరువాత  ఎటువంటి సహకారం అందదు అని అనుకోలేదు. ఒక దశదాకా పని పూర్తి చేస్తే మళ్ళీ ముందుకు వెళ్ళ వచ్చని ఆశయం.

తరువాత ఏం చేద్దాం అనేదాని గురించి ఎవ్వరూ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆలా ఆగిపోవటం వలన దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేనట్లే ఉన్నారు. రోజులు నెలలు సంవత్సరాలు గడిచి పోతున్నాయి. 5 సంవత్సరాలయినా ఎటువంటి పురోగతి లేదు. చుట్టూ మళ్ళీ యధాప్రకారంగా కంచి విత్తనం చెట్లు పెరిగిపోయి రోడ్డు మీదకు కట్టడం ఆనవాలు కనపడకుండా పోయింది.

ఈ లోపల ఆ రెండు లక్షల రూపాయలతో ఒక చిన్న గుడి కడితే పోయేదానికి పెద్ద అంచనాతో పెద్ద నిర్మాణం పెట్టేశారు. దీనికి డబ్బు ఎక్కడ నుండి వస్తుందనుకున్నారు? చిన్నది కడితే మెల్లగా అదే అభివృద్ధి చెందుతుంది. అనవసరంగా అటూ ఇటూ కాకుండా ఉన్నదంతా దుర్వినియోగం చేసేశారని ఒకరు తూలనాడారు. ఇది జరగదని మాకు ముందే తెలుసని మరొకరు ఆనంద పడ్డారు. అంతకు ముందు LIC నాగేశ్వరరావు అని పిలువబడే భూస్వామి దగ్గరకు వెళితే అయన చందా ఇవ్వనన్నారు.

ఇలాంటివి ప్రారంభిస్తారు కానీ అనేక రాజకీయాల వల్ల పని జరుగదు. అలా అలా పోగుచేసిన చందాలు కొందరి జేబుల్లోకి వెళ్లిపోతాయి. మీరు పని చేసి రండి ఇస్తాను. అంతే కాని ముందు ఇవ్వనన్నారు. అలాంటివి గుర్తుకు వచ్చాయి. పని పూర్తయిన తరువాత ఆయన్ను మరొకసారి కలిశాము. అప్పుడు కూడా అయన ఏమీ ఇవ్వలేదు. అది వేరొక సంగతి.

అప్పుడు ఆంధ్రాబ్యాంకు మేనేజరుగా ఉన్న భాస్కరరావు గారు నాతో ఈ పరిస్థితికి కారణం ఏమిటని అడిగారు. నేను వివరించి ఆయన్ను ఒకసారి ఊరిలోకి వచ్చి నలుగురితో మాట్లాడి కదిలించమన్నాను. అయన వచ్చి మాట్లాడి వెళ్లారు. ఈ లోపల 15,000 రూపాయలు అందాయి. ఎంతో కొంత పని మొదలు పెడదామని చుట్టూ రైలింగుకు కావలసిన సిమ్మెంటు కోళ్లు తెచ్చి పని ప్రారంభించాను. మళ్ళీ కంచి విత్తనం చెట్లు కొట్టేసి శుభ్రం చేశాము.

దిడ్డి మాధవరావు గారు సహకరించడం మొదలు పెట్టారు. J.C.B. ఒకటి ఊళ్లోకి వచ్చింది. దానిని పెట్టి కోనేరు గట్టు ఏర్పాటు ప్రారంభించాము. రోడ్డు పక్కన కోనేరు పొడుగునా పెద్ద పొడవాటి గొయ్యి ఉండేది. ట్రాక్టర్లని పెట్టి దానిని రోడ్డు లెవలుకు పూడ్చివేసాము. J.C.B. శబ్దం, ట్రాక్టర్ల హడావుడికి జనం పోగయ్యారు. అప్పటికప్పుడు ఆ పనికి సరిపడగా సొమ్ము పోగయ్యింది. పని ప్రారంభించినప్పుడు OIL కి మాత్రమే డబ్బులు ఉన్నాయి. పూర్తయ్యేటప్పటికీ ఇబ్బంది లేకుండా డబ్బులు సరిపెట్టెయ్యగలిగాము.

ఈ లోపల రైతులంతా ఎకరానికి 500 రూపాయలు చందాగా ఇవ్వాలని తర్జన భర్జనలతో నిర్ణయించారు.