గుడి నిర్మాణం ఎలాగా చేయాలని నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఈ పని ఎక్కడ చెయ్యాలి అనేది మొదటి సమస్య. ఊరవతల దక్షిణంగా పునాదుల వరకు తయారయ్యి 40 సంవత్సరాలుగా ఆగిపోయిన దానిమీద గోడలు కట్టి, స్లాబువేసి పని పూర్తి చెయ్యవచ్చు.
ఒక వర్గం అభిప్రాయం ప్రకారం అది సరి అయిన స్థలం కాదు, అక్కడ పని అవ్వదు, అది వద్దని. నేను కూడా గుడి కట్టినా ఆమూలకు ఎవ్వరూ వెళ్ళరని అనుకున్నాను. అక్షరాలు కడదాకా నేర్చుకోని ఒక సిద్ధాంతిని నమ్ముకున్న మరొక వర్గం ఆయన్ను తీసుకువచ్చారు. ఆయనేం చెప్పాడంటే – ఊరికి నైరుతి మూల శివాలయం ఉండాలి. నేను మాఊళ్ళో అలాగే కట్టించాను. మీరు కూడా ఊరవతల నైరుతి మూల దిబ్బల మీద కట్టుకోండి. దానికోసం మీరు ఎక్కువగా కష్టపడక్కరలేదు. నా దగ్గరకు చాలామంది వస్తూవుంటారు. వారిలో ఒకడిని ఒక లారీ ఇసుక వెయ్యమంటాను. మరొకడిని కంకర తోలమంటాను. ఇంకొకడిని 10 బస్తాలు సిమ్మెంటు ఇమ్మంటాను. ఇలాగ రకరకాలుగా ఏదో రూపంలో సహకారం తీసుకుంటూ పని పూర్తి చేసేస్తాను. మీ దగ్గర ఉన్న డబ్బుకి వీటి సహకారం తోడయితే పని సులువుగా అయిపోతుందని, చిటికలేస్తే పని ఎంత అన్నట్లుగా మాట్లాడాడు. ఎందుకో ఆ నైరుతి మూల పని అంటే నాకు నచ్చలేదు. ఊరవతల ఆమూలకు ఎవరూ వెళ్ళరనుకున్నాను.
ప్రస్తుతం గుడి కట్టిన ప్రాంతం ఊరికి ప్రారంభంలో ఉంది. రోడ్డు పక్కన ఉంది. గుడికి తూర్పుభాగంలో కోనేరు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఎవరు ఊరిలోకి వచ్చినా వెళ్ళినా గుడి కనపడుతుంది. ప్రత్యేకంగా దానికోసమని ఊరి చివరకు వెళితేనే కానీ కనపడదన్న బాధ లేదు. ఇక్కడ అయితే అందంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం.
గురువుగారు శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారు కొవ్వూరులో ఉన్నారు. భగవంతుడి దయవల్ల వారితో ఏర్పడిన కొద్దిపాటి పరిచయంతో వారి దగ్గరకు వెళ్ళి సమస్యను వివరించాము. వారిని ఒక్కసారి వచ్చి చూసి ఏ ప్రదేశం అనుకూలంగా ఉంటుందో చెప్పవలసినదిగా కోరాము. ఆయన మా విన్నపాలను ఆలకించి సరే వస్తామన్నారు. వారు వచ్చే విషయాన్ని ఊరి వాళ్ళకు చెప్పాము. వారు వచ్చిన తరువాత రామాలయానికి తీసుకువెళ్ళాము. ఆయన్ను కూర్చోపెట్టి ఆ చుట్టుపక్కల ముఖ్యమయిన వాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాం.
గురువుగారు పరిశీలన చేసి మేము ఎంపిక చేసిన ప్రదేశమే బాగుంటుందని అన్నారు. ఊరికి ముందు శివాలయం ఉండాలన్నారు. పడమర విష్ణ్వాలయం ఉండాలన్నారు. అగ్రే హరః. అంటే ముందు ఈశ్వరుడు ఉన్న గ్రామం అగ్రహారం. శివుని తూర్పు దృష్టి నీటి మీద పడేలాగ తూర్పున కోనేరు ఉంది. పశ్చిమ ముఖం సద్యోజాత ముఖం ఊరుని చూస్తూ ఉంటుంది. ఇది అన్ని విధాలా శ్రేష్ఠమయినదని చెప్పారు.
ఈ లోపల సిద్ధాంతిగారిని తీసుకురావడానికి ఆ వర్గం వారు ఏర్పాటు చేశారు. గురువుగారితో సమావేశం అయిపోయింది, అందరూ సిద్ధాంతిగారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపయినా ఆయన రాలేదు. గురువుగారిని తీసుకుని అందరం మా ఇంటి దగ్గరకు వచ్చాము. ఆయనకు ఒక చివర కుర్చీ వేసి ఇరుకుగా ఉన్న మా ఇంటి ముందు వసారాలో అందరం కూర్చున్నాం.
(ఈ క్రింది ఫొటో గురువుగారు శ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రిగారు ప్రతిష్ఠకు ముందు ఇంకొక మారు వచ్చినప్పుడు తీసినది)

ఇంక గురువుగారు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా సిద్ధాంతిగారిని తీసుకురావడానికి వెళ్ళిన Motor Cycle వచ్చింది. ఆయన లోపలకి వచ్చారు. ఆయనకు కూడా గురువుగారికి దగ్గరగా ఒక కుర్చీ వేశాము. ఆయన ఆ కుర్చీలో కూర్చోవడానికి వెళ్ళబోయి గురువుగారిని చూసి ఒకింత సందేహించారు. గురువుగారి వర్చస్సును చూసి ఆయన గొప్ప పండితుడని గ్రహించాడేమో ఒక అడుగు వెనక్కి వేసి నేల మీద కూర్చుండి పోయాడు. గురువుగారు ఆయన వంక చెప్పమనట్లు చూశారు. సిద్ధాంతిగారు ఆలయం ఊరికి నైరుతి మూల కట్టాలని నసిగారు. అలా చెప్పడానికి మీ దగ్గర ఏదయినా శాస్త్ర ప్రమాణం ఉందా అని గురువుగారు అడిగారు. ఏదయినా సరిగ్గా తెలిస్తే చెప్పండి అన్నారు. దానికి ఆయన నేను పెద్దగా చదువుకోలేదు అన్నారు. గురువుగారు ఆయనతో స్వల్పంగా వివరించి ఇలా అన్నారు. నన్ను ఇక్కడకు స్థలం నిర్ణయం చేయడానికి రమ్మని పిలిస్తే చూడటానికి వచ్చాను. ఏది సరి అయిందో చెప్పాను. అంతవరకే నా పని. మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. మీకు తోచినట్లు చేసుకోండి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. సిద్ధాంతి మారు మాట్లాడలేదు. ఆ విధం గా గుడిని ఎక్కడ నిర్మించాలనే వివాదం సమసిపోయింది.
ఎంపిక చేసిన స్థలం ఎలా ఉంది?
ఎక్కడ కట్టాలి అనే నిర్ణయం జరిగిపోయింది. కానీ ఆ స్థలం ఎలా వుంది? అది రోడ్డు కంటే గజం పల్లంగా ఉంది. చిత్తడి నేల. విపరీతంగా పెరిగిన కంచి విత్తనం ముళ్ళ పొదలు. మధ్యలో నాలుగు తాడి చెట్లు, గడ్డిమేటు, చిన్నపాక. ఇద్దరి ఆధీనంలో ఉంది. ఆ ఇద్దరికి ఒక 20,000 రూపాయలు ఇచ్చి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే వాళ్ళు ఊరు వదిలి హైదరాబాదులో ఏదో పని చేసుకుంటున్నారు.
ఒక J.C.B ని మాట్లాడి తుప్పలు అవీ తీసేసి తాడి చెట్లని కూడా తీసేసాము. అయినా పెద్ద పెద్ద ముళ్ళు భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. స్థలం మధ్యగా 50 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు ఉండేలాగ ఒక గజం లోతు J.C.B. తో మట్టి తీయించి చుట్టూ సద్దించాము. అప్పటికి ఒక ఆకారం వచ్చింది.





